బాలికలపై లైంగిక వేధింపులు
● నిందితుడికి టీడీపీ నేతల అండ
● ఐసీడీఎస్, మహిళా సంఘాల చొరవతో పోక్సో కేసు
కావలి: కొన్నిరోజులుగా బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న విషయమై పాఠశాల హెచ్ఎం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయినా రాజకీయ ఒత్తిళ్లతోపాటు తల్లిదండ్రులు ఫిర్యాదు చేయలేదంటూ కేసు నమోదు చేయలేదు. నిందితుడిని కాపాడేందుకు టీడీపీ నేతలు గురువారం మధ్యాహ్నం వరకు పోలీస్స్టేషన్లోనే ఉండి కేసు నమోదు కాకుండా తీవ్రంగా ప్రయత్నించారు. అయితే ఈ ఘటన వెలుగు చూసిన తర్వాత ఐసీడీఎస్ పీడీ హేనాసుజన్ ఆదేశాల మేరకు స్థానిక అధికారిణి సాధన, లీలావతి, పలు మహిళా సంఘాలు రంగంలోకి దిగారు. దీంతో సదరు నేతలు అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆ తర్వాత నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేశారు.
మొదటి నుంచి అంతే..
నిందితుడు జ్ఞానప్రసాద్ పాఠశాలల వద్ద బొరుగుల మిక్చర్, నూడిల్స్ వ్యాపారం చేసుకుంటూ.. వారికి మాయమాటలు చెప్పి డబ్బులు, తినుబండారాల ఆశ చూపించి రోజూ లైంగికంగా దాడికి పాల్పడుతున్నట్లు బాధిత బాలికలు ఐసీడీఎస్ అధికారులు, మహిళా సంఘాల సమక్షంలో వెల్లడించారు. ఈ విషయాన్ని బాలికలు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నట్లు పేర్కొన్నారు. అయితే ఈనెల 24న పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మధుసూదన్రావు దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన రెండో పట్టణ పోలీస్స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. నిందితుడిపై ఫిర్యాదు చేయాలంటే బాధితుల తల్లిదండ్రులే ఉండాలి.. మీకేమి సంబంధమంటూ పోలీసులు అవమానించారని ప్రధానోపాధ్యాయుడు తెలిపారు. ఈ క్రమంలో స్థానిక ఉమెన్ ఫోర్స్ అధ్యక్షురాలు చాకలికొండ శారద, ఐసీడీఎస్ అధికారిణులు సాధన, లీలావతి, స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వాహకురాలు లావణ్య, బాలల హక్కుల పరిరక్షణ సమితి జిల్లా కన్వీనర్ అబ్దుల్ అలీమ్ బాధిత బాలిక తల్లిదండ్రులతో కలిసి పోలీస్స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేయించారు. విధి లేని పరిస్థితిలో 2వ పట్టణ పోలీసులు కేసు నమోదు చేసినట్లు సమాచారం.


