పచ్చని చెట్లు కూల్చివేత
నెల్లూరు(వేదాయపాళెం): మద్యం వ్యాపారులు బరితెగించారు. పర్యావరణ చట్టానికి తూట్లు పొడుస్తూ.. నేషనల్ హైవే అథారిటీ పర్యవేక్షణలో పెంచిన పచ్చని చెట్లను నరికేశారు. జాతీయ రహదారి పక్కన ఏర్పాటు చేసిన తమ దుకాణం వాహనచోదకులకు బాగా కనిపించేందుకు ఈ దారుణానికి తెగబడ్డారు. టీడీపీ ప్రభుత్వం ప్రైవేట్ మద్యం దుకాణాలను విచ్చలవిడిగా ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో నెల్లూరులోని జాతీయ రహదారిపై అనేక షాపులున్నాయి. మందుబాబులను ఆకట్టుకునేందుకు పెద్ద బోర్డులు, లైటింగ్ను ఏర్పాటు చేశారు. చింతారెడ్డిపాళెం కూడలిలో మెడికవర్ ఆస్పత్రి ఎదురుగా ఎస్ఎల్ఎన్ఎస్ మద్యం షాపును జాతీయ రహదారికి పడమర వైపు ఏర్పాటు చేశారు. వాహనాల్లో ప్రయాణించే మందు బాబులకు షాపు కనిపించేందుకు చెట్లు అడ్డుగా ఉన్నాయని భావించి వాటిని నరికివేయించారు. నేషనల్ హైవే అథారిటీ అధికారులు రోడ్డు పక్కన మొక్కలు నాటించి సంరక్షించారు. నేడు ఎన్నో చెట్లు వాహనదారులకు ఉపయోగకరంగా ఉన్నాయి. అయితే మద్యం షాపు నిర్వాహకులు ఏ మాత్రం లెక్కచేయకుండా వ్యాపారమే పరమావధిగా పచ్చని చెట్లను పొట్టన పెట్టుకున్నారు. నిట్టనిలువునా భారీ చెట్లను కొట్టేయించడం విమర్శలకు తావిస్తోంది. మొక్కలు నాటి పర్యావరణాన్ని సంరక్షించుకుందామని నిత్యం మాటలు చెప్పే అధికారులు ఇంత దారుణం జరుగుతున్నా పట్టించుకోకపోవడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మద్యం షాపు నిర్వాహకుల బరితెగింపు
పర్యావరణ చట్టానికి తూట్లు
దుకాణం కనిపించేందుకు
నరికేసిన వైనం
నెల్లూరులో హైవే పక్కన పరిస్థితి
పచ్చని చెట్లు కూల్చివేత
పచ్చని చెట్లు కూల్చివేత


