రౌడీషీటర్పై పీడీ యాక్ట్
నెల్లూరు(క్రైమ్): రౌడీషీటర్ కిట్టూపై నెల్లూరు వేదాయపాళెం పోలీసులు బుధవారం పీడీ యాక్ట్ ప్రయోగించారు. ఇన్స్పెక్టర్ కె.శ్రీనివాసరావు వివరాలు వెల్లడించారు. నెల్లూరు పొదలకూరు రోడ్డు జెడ్పీ హైస్కూల్ సమీపంలో శివకుమార్ కృష్ణసాయి అలియాస్ కిట్టూ నివాసముంటున్నాడు. అతనిపై వేదాయపాళెం పోలీస్స్టేషన్లో రౌడీషీట్ ఉంది. గతేడాది జరిగిన రౌడీషీటర్ చింటూ హత్య కేసులో కిట్టూ నిందితుడు. ఇప్పటి వరకు అతనిపై ఏడు కేసులున్నాయి. సత్ప్రవర్తనతో మెలగాలని పోలీసు అధికారులు పలుమార్లు సూచించినా మారలేదు. దీంతో కలెక్టర్ హిమాన్షు శుక్లా అనుమతితో కిట్టూపై పీడీ యాక్ట్ నమోదు చేసి కడప కేంద్ర కారాగారానికి తరలించారు.స్టేషన్ పరిధిలో ఇప్పటి వరకు ఎనిమిది మంది రౌడీషీటర్లపై పీడీ యాక్ట్ ప్రయోగించి జైలుకు పంపామని ఇన్స్పెక్టర్ తెలిపారు. ఎవరైనా ప్రజా జీవనానికి, శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
మెడికల్ మాఫియాపై పోరాటం
నెల్లూరు(వీఆర్సీసెంటర్): జిల్లాలో మెడికల్ మాఫియాను అంతమొంచే వరకూ తమ పోరాటం ఆగదని సీపీఐ జిల్లా కార్యదర్శి అరిగెల నాగేంద్రసాయి తెలిపారు. నెల్లూరులోని సంతపేటలో ఉన్న ఆ పార్టీ జిల్లా కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కాకినాడలో జరిగిన రాష్ట్ర సమావేశాల్లో మెడికల్ మాఫియాపై పోరాటం చేయాలని తీర్మానించినట్లు చెప్పారు. ఈనెల 28వ తేదీన జిల్లాలోని అన్ని నియోజకవర్గాల కేంద్రాల్లో ప్రభుత్వాస్పత్రుల వద్ద నిరసన కార్యక్రమాలు చేపట్టటం జరుగుతుందన్నారు. మార్చి 15వ తేదీన ఇంటింటికీ వెళ్లి పార్టీ చేపట్టే కార్యక్రమాలను తెలియజేస్తామన్నారు. సమావేశంలో నాయకులు అంకయ్య, మధు, రమణయ్య, మాలకొండయ్య, సిరాజ్, మున్నా, శంకర్ కిషోర్ పాల్గొన్నారు.
కండలేరులో 54.480 టీఎంసీలు
రాపూరు: కండలేరు జలాశయంలో బుధవారం 54.480 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు ఈఈ గజేంద్రరెడ్డి తెలిపారు. కండలేరు నుంచి సత్యసాయి గంగ కాలువకు 2,100, లోలెవల్ కాలువకు 200, హైలెవల్ కాలువకు 240, పిన్నేరు కాలువకు 50, మొదటి బ్రాంచ్ కాలువకు 85 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.


