ఐటీడీఏ.. అంతా అస్తవ్యస్తం
● ఇన్చార్జి ఏపీఓలే దిక్కు
● ఏపీఓ అడ్మిన్దే పెత్తనం
● పనుల్లో మాత్రం అలసత్వం
● నాటుకోళ్ల పథకం అమలుపై నిర్లక్ష్యం
నెల్లూరు(స్టోన్హౌస్పేట): నెల్లూరులో సమీకృత గిరిజన అభివృద్ధి ప్రాజెక్ట్ (యానాదులు) జిల్లా ప్రధాన కార్యాలయం ఉంది. ఇక్కడి అధికారులు బాపట్ల, ఒంగోలు, నెల్లూరు, మార్కాపురం, వైఎస్సార్ కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో గిరిజనుల సమస్యలను పరిష్కరించి వారి ఆర్థికాభివృద్ధికి కృషి చేయాలి. రెగ్యులర్ పీఓ లేకపోవడంతో పనులు నత్తనడకన జరుగుతున్నాయని ఆరోపణలున్నాయి. డెవలప్మెంట్ ఆఫీసర్ పోస్టు 3 సంవత్సరాల నుంచి ఖాళీగా ఉంది. ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ జిల్లాలోని 103 విద్యాసంస్థలను పర్యవేక్షించాలి. అయితే ఆమెకే ఇన్చార్జి పీఓ బాధ్యతలు ఇవ్వడంతో ఇక్కడ ఆశించిన మేరకు పనులు జరగడం లేదనే విమర్శలున్నాయి. విద్యాసంస్థల్లోని పది, ఇంటర్మీడియట్ విద్యార్థుల చదువు, వారి స్టడీ అవర్స్, మెనూ ప్రకారం ఆహారం అందజేస్తున్నారా? తదితర అంశాలపై కూడా పర్యవేక్షణ కొరవడిందని, వార్డెన్లు సమయానికి పనులు చేయడం లేదని గురుకులాలు, రెసిడెన్షియల్ సిబ్బంది ఆవేదన చెందుతున్నారు.
ఏపీఓల పరిస్థితి ఇదీ
జిల్లా ప్రధాన కార్యాలయంలో ఎవరు ఏ పనిచేస్తున్నారో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఈ శాఖలో ఐదుగురు ఏపీఓలున్నారు. అగ్రిక్చలర్, హార్టికల్చర్, రెవెన్యూ, ఫిషరీస్ విభాగాలను ఆయా జిల్లాల్లో ఏపీఓలే పర్యవేక్షించాలి. ప్రభుత్వం గిరిజనులకు ఎలాంటి పథకాలు ప్రకటించకపోవడంతో వారికి నిర్దిష్ట కార్యాచరణ లేకుండా పోయింది. ఇక ఏపీఓ అడ్మిన్గా బాధ్యతలు నిర్వహిస్తున్న వ్యక్తి ఎప్పుడొస్తారో, ఎప్పుడొళ్తారో సిబ్బందికే తెలియడం లేదు. ఆయన ఇతర జిల్లాకు చెందిన వ్యక్తి. ప్రతి శనివారం తన ఊరికెళ్లి బుధవారం మళ్లీ కార్యాలయానికి వస్తున్నారు. కాగా పర్యటనల పేరుతో వెళ్లిపోవడంతో అర్జీదారులు సమస్యలు చెప్పడానికి ఇబ్బందులు పడుతున్నారు.
ఎన్నో సమస్యలు
గతంలో తిరుపతిలో నిర్వహించిన ఐఏఎస్, ఐపీఎస్, గ్రూప్ – 1 ఉచిత కోచింగ్కు డైరెక్టర్ ఆఫ్ ట్రైబల్ వెల్ఫేర్ నుంచి రూ.50 లక్షలు కేటాయించారు. ఏడుగురు గ్రూప్ – 1 పోస్టులకు ఎంపికయ్యారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన స్వచ్ఛంద సంస్థకు రూ.25 లక్షలు మాత్రమే చెల్లించారు. మిగిలిన నగదును ఇటీవల డైరెక్టర్ ఆఫ్ ట్రైబల్ వెల్ఫేర్ మంజూరు చేసినా చెల్లించేందుకు ఇన్చార్జి పీఓ, అడ్మిన్ ఏపీఓ సముఖంగా లేరని సమాచారం. ఇంకా మూలాపేటలో ఇళ్లు, దుకాణాల మధ్య ఉన్న డిగ్రీ హాస్టల్ను సురక్షితమైన ప్రదేశానికి మార్చడానికి ప్రయత్నాలు జరగడం లేదు. ఐటీడీఏలో వార్డెన్లుగా పనిచేస్తున్న కొందరిపై వచ్చిన ఫిర్యాదులను పరిష్కరించే దిక్కు కూడా లేకుండా పోయింది. సిబ్బందిపై వచ్చిన ఫిర్యాదులు నిజమని ఆర్టీఏ ద్వారా వెల్లడైనా చర్యల్లేవు. ఇప్పటికై నా సంబంధిత ఉన్నతాధికారులు కార్యాలయంపై విచారణ జరిపి త్వరగా రెగ్యులర్ పీఓను నియమించాలని యూనియన్ల నాయకులు కోరుతున్నారు.
ఈ పథకం ఏమైందో..
గిరిజనుల అభివృద్ధి కోసం ఓ స్వచ్ఛంద సంస్థ నాటుకోళ్ల పెంపకానికి ఓ పథకాన్ని రూపొందించి డైరెక్టర్ ఆఫ్ ట్రైబల్ వెల్ఫేర్ నుంచి ఐటీడీఏకు ప్రతిపాదనలు పంపించింది. తిరుపతి జిల్లాలో డక్కిలి, వెంకటగిరి మండలాల్లో 368, నెల్లూరు జిల్లాలో తోటపల్లిగూడూరు, ముత్తుకూరు మండలాల్లో 368 కోళ్లను బ్యాక్యార్డు పౌల్ట్రీ పథకంలో భాగంగా లబ్ధిదారులకు అందజేయాలనేది ఆలోచన. అయితే ఈ కార్యక్రమాన్ని అమలు చేసేందుకు ఇంతవరకు ఎటువంటి చర్యలు చేపట్టలేదు. దీనికి ఏపీఓ అడ్మిన్ నిర్లక్ష్యమే కారణమని ఆరోపణలున్నాయి. ఆ మండలాల్లో ఎవరికి ఈ పథకాన్ని అందజేయాలో, కోడిపిల్లల పెంపక నిర్వహణకు అవసరమైన రూ.15 వేలు ఎవరికివ్వాలో స్పష్టత లేదు. ఈ విషయంలో కమీషన్ ఆశిస్తున్నట్టు సమాచారం.
గిరిజనుల అభివృద్ధి కోసం ఏర్పాటైన ఐటీడీఏలో అస్తవ్యస్త పరిస్థితులున్నాయి. పీఓ బదిలీ జరిగి నాలుగు నెలలైంది. అప్పట్నుంచి జిల్లా ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్కు పీఓ ఇన్చార్జి
బాధ్యతలను అప్పగించారు. ఈ మధ్య కాలంలో అనేక పనులు మందుకు సాగని పరిస్థితి
ఉంది. సమస్యలున్న వారు ఇబ్బంది పడుతున్నారు.
ఐటీడీఏ.. అంతా అస్తవ్యస్తం
ఐటీడీఏ.. అంతా అస్తవ్యస్తం


