అఘాయిత్యాలపై ఏం చర్యలు తీసుకున్నారు?
● శ్రామిక మహిళా సమన్వయ కమిటీ
రాష్ట్ర కన్వీనర్ ధనలక్ష్మి
నెల్లూరు(వీఆర్సీసెంటర్): ‘మహిళలపై దాడులు, దౌర్జన్యాలు పెరిగిపోయాయాయి. ఇంత జరుగుతుంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హోంమంత్రి అనిత ఏం చర్యలు తీసుకున్నారు’ అని శ్రామిక మహిళా సమన్వయ కమిటీ (సీఐటీయూ) రాష్ట్ర కన్వీనర్ ధనలక్ష్మి ప్రశ్నించారు. నెల్లూరులోని జెట్టి శేషారెడ్డి విజ్ఞాన కేంద్రంలో బుధవారం మున్సిపల్ ఫెడరేషన్ శ్రామిక మహిళా రాష్ట్ర సదస్సు జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళ ఒంటిపై చేయి వేస్తే తాట తీస్తానని పవన్ కళ్యాణ్ అన్నారన్నారు. వేలాది మంది మహిళలు అపహరణకు గురవుతున్నా, బాలికలపై హత్యలు, లైంగికదాడులు జరుగుతున్నా ఆయన, హోంమంత్రి ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలన్నారు. మహిళా కార్మికులపై రాజకీయ వేధింపులు ఎక్కువయ్యాయని, అక్రమంగా తొలగిస్తున్నారని ఆరోపించారు. వారిపై లైంగిక వేధింపులు నిరోధించేందుకు ఫిర్యాదుల కమిటీలను ఏర్పాటు చేయాలన్నారు. అనంతరం నిర్వహించిన ఎన్నికల్లో మున్సిపల్ ఫెడరేషన్ శ్రామిక మహిళా రాష్ట్ర కన్వీనర్గా విజయవాడకు చెందిన విజయలక్ష్మి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సదస్సులో ఉమామహేశ్వరరావు, వజ్రమ్మ, విజయమ్మ, వెంగమ్మ, వరలక్ష్మి, సునీల్, పెంచలనరసయ్య తదితరులు పాల్గొన్నారు.


