గిరిజనుల సమస్యలపై వినతి
నెల్లూరు(బారకాసు): మాజీ మేయర్ పొట్లూరి స్రవంతి మంగళవారం ఢిల్లీలో కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి జుయెల్ ఓరంను కలిశారు. అలాగే పార్లమెంట్ సభ్యుడు, ఎస్సీ, ఎస్టీ వెల్ఫేర్ కమిటీ నాయకుడు ఫగ్గన్ సింగ్ కులస్తేను కూడా కలిశారు. గిరిజన సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లారు.
21, 22 తేదీల్లో
క్రికెట్ జట్ల ఎంపికలు
నెల్లూరు(స్టోన్హౌస్పేట): 2026 – 27 సంవత్సరానికి నెల్లూరు జిల్లా అండర్ – 19, 23 క్రికెట్ జట్ల ఎంపికలు నెల్లూరులోని ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో జరుగుతాయని జిల్లా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎస్.రాజశేఖరరెడ్డి, కార్యదర్శి కె.శ్రీనివాసులు మంగళవారం ఒక సంయుక్త ప్రకటనలో తెలిపారు. 21న అండర్ – 19, 22న అండర్ – 23 క్రికెట్ జట్ల ఎంపికలు నిర్వహిస్తామన్నారు. క్రీడాకారులు వైట్ అండ్ వైట్ డ్రెస్కోడ్, సొంత కిట్, జనన ధ్రువీకరణపత్రం, ఆధార్కార్డుతో రావాలని సూచించారు.
ఉత్సాహంగా
జిల్లా స్థాయి చెస్ పోటీలు
నెల్లూరు(స్టోన్హౌస్పేట): శాప్ లీగ్ పోటీల్లో భాగంగా జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం నెల్లూరులోని ఏసీ సుబ్బారెడ్డి స్పోర్ట్స్ కాంప్లెక్స్లో నిర్వహించిన జిల్లా స్థాయి చెస్ పోటీల్లో క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. జిల్లా క్రీడాభివృద్ధి అధికారి పాండురంగారావు, స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ సెక్రటరీలు బీవీ రమణయ్య, ఎం.దేవిక ఈ పోటీలను ప్రారంభించారు. డీఎస్డీఓ మాట్లాడుతూ అండర్ – 13, 15, 17, 19 విభాగాల్లో బాలురు 144 మంది, బాలికలు 47 మంది పోటీల్లో తలపడుతున్నారని తెలిపారు. ప్రతిభ చూపిన వారిని ఈనెల 21, 22 తేదీల్లో రాష్ట్ర స్థాయిలో తిరుపతిలో జరిగే పోటీలకు జిల్లా తరఫున పంపిస్తామన్నారు. కార్యక్రమంలో జిల్లా చెస్ అసోసియేషన్ ఫిడే ఇన్స్ట్రక్టర్ అబ్దుల్ అజీజ్, వ్యాయామ విద్య ఉపాధ్యాయులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
రైలు ఢీకొని వ్యక్తి మృతి
కావలి రూరల్: కావలి – తెట్టు రైల్వేస్టేషన్ల మధ్య 231/4 – 6 పోస్టుల మధ్య దిగువ లైన్లో మంగళవారం రైలు ఢీకొని గుర్తుతెలియని వృద్ధుడు మృతిచెందాడు. అతని వయసు 60 – 65 సంవత్సరాల మధ్య ఉంటుందని భావిస్తున్నారు. పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొని మరణించినట్లు రైల్వే ఎస్సై వెంకట్రావు తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.
పారిశ్రామిక వినియోగదారుల పరిష్కార వేదిక నేడు
నెల్లూరు(వీఆర్సీసెంటర్): పారిశ్రామిక విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక తిరుపతిలో బుధవారం జరుగుతుందని ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ శివశంకర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. అక్కడి సీఎండీ కార్యాలయంలో ఉదయం 10:30 నుంచి 11:30 గంటల వరకు నిర్వహించే ఈ కార్యక్రమంలో జిల్లాకు చెందిన పారిశ్రామిక వినియోగదారులు నేరుగా పాల్గొని సమస్యలు చెప్పొచ్చన్నారు. ఇంకా విద్యుత్ శాఖ టోల్ఫ్రీ నంబర్ 1800 425 155333, వాట్సాప్ నంబర్ 91333 1912కు సమస్యలు చెబితే పరిష్కరిస్తామని తెలియజేశారు.
కండలేరులో
56.100 టీఎంసీలు
రాపూరు: కండలేరు జలాశయంలో మంగళవారం నాటికి 56.100 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు ఈఈ గజేంద్రరెడ్డి తెలిపారు. కండలేరు నుంచి సత్యసాయి గంగ కాలువకు 1,200, లోలెవల్ కాలువకు 200, హైలెవల్ కాలువకు 240, పిన్నేరు కాలువకు 50, మొదటి బ్రాంచ్ కాలువకు 85 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు.
నిమ్మ ధరలు (కిలో)
పెద్దవి : రూ.82
సన్నవి : రూ.70
పండ్లు : రూ.40
గిరిజనుల సమస్యలపై వినతి
గిరిజనుల సమస్యలపై వినతి


