బంగారు ఉంగరం కోసమే వృద్ధుడి హత్య
చిల్లకూరు: జల్సాలకు అలవాటుపడి అప్పలపాలైన ఓ యువకుడు బంగారు ఉంగరం కోసమే వృద్ధుడిని దారుణంగా హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈనెల 13వ తేదీన జరిగిన హత్య కేసులో నిందితుడిని అరెస్ట్ చేశారు. చిల్లకూరు పోలీస్స్టేషన్లో మంగళవారం గూడూరు ఒకటో పట్టణ ఇన్స్పెక్టర్ శేఖర్బాబు వివరాలు వెల్లడించారు. నెలబల్లిరెట్టపల్లికి చెందిన ఎడ్డేం రమణారెడ్డి (83) తన గేదెలను రోజూ సమీపంలోని పొలాల్లోకి మేతకు తీసుకెళ్తుంటాడు. అదే గ్రామానికి చెందిన పసుపులేటి శ్రీనివాసులు అనే యువకుడు బెట్టింగ్లు ఆడుతూ జల్సాలు చేసి అప్పులపాలయ్యాడు. అతను గేదెలు మేపేందుకు ఒంటరిగా వెళ్లే రమణారెడ్డి వేలికి ఉన్న బంగారు ఉంగరాన్ని గమనించాడు. దొంతాల చెరువు సమీపంలో ఉన్న జామాయిల్ తోటలోకి రమణారెడ్డి గేదెలను తీసుకెళ్లిన సమయంలో శ్రీనివాసులు కర్రతో దాడి చేశాడు. దీంతో వృద్ధుడు బోర్లా పడ్డాడు. మరోసారి కర్రతో తలపై మోదడంతో మృతిచెందాడు. శ్రీనివాసులు ఉంగరాన్ని తీసుకుని పరారయ్యాడు. పోలీసులు కేసు నమోదు చేశారు. బూదనం సమీపంలోని బస్షెల్టర్ వద్ద అనుమానాస్పదంగా ఉన్న శ్రీనివాసుల్ని అదుపులోకి తీసుకుని విచారించగా నేరం చేసినట్లు అంగీకరించాడు. సమావేశంలో ఎస్సై సురేష్బాబు, సిబ్బంది విష్ణు, జయరామయ్య, నాగరాజు పాల్గొన్నారు.


