సాఫ్ట్వేర్ ఉద్యోగం పేరుతో మోసం
● పోలీస్ కార్యాలయంలో
‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’
● 132 వినతుల అందజేత
నెల్లూరు(క్రైమ్): సాఫ్ట్వేర్ ఉద్యోగం ఇప్పిస్తానని మోసం చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని బాధితులు పోలీసు ఉన్నతాధికారులను కోరారు. సోమవారం నెల్లూరులోని జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. 132 మంది తమ సమస్యలను వినతుల రూపంలో ఎస్పీ అజిత వేజెండ్లకు అందజేశారు. వాటిని పరిశీలించిన ఆమె చట్టపరిధిలో విచారించి న్యాయం చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో ఏఎస్పీ సీహెచ్ సౌజన్య, లీగల్ అడ్వైజర్ శ్రీనివాసులురెడ్డి, మహిళా పోలీసుస్టేషన్, డీసీఆర్బీ, ఎస్బీ ఇన్స్పెక్టర్లు టీవీ సుబ్బారావు, ఎన్.రామారావు, డి.వెంకటేశ్వరరావు, బి.శ్రీనివాసరెడ్డి, ఫిర్యాదుల విభాగం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
వినతుల్లో కొన్ని..
● వాట్సాప్ ద్వారా అనంతపురం ప్రాంతానికి చెందిన రాజు పరిచయమయ్యాడు. సాఫ్ట్వేర్ ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి ఒక్కొక్కరి వద్ద రూ.1.50 లక్షలు తీసుకున్నాడు. ఉద్యోగం ఇప్పించకుండా, నగదు తిరిగివ్వకండా ఇబ్బంది పెడుతున్నాడు. విచారించి న్యాయం చేయాలని ఇందుకూరుపేటకు చెందిన ఓ వ్యక్తి, అతని స్నేహితుడు కోరారు.
● సంతపేటకు చెందిన వెంకట్రావు చిట్స్ వేయించుకుని నగదు తిరిగివ్వకుండా మోసగించాడని నెల్లూరు రూరల్ పరిధికి చెందిన ఓ వ్యక్తి అర్జీ ఇచ్చాడు.
● భర్త చెడు వ్యసనాలకు బానిసై మానసికంగా, శారీరకంగా హింసిస్తున్నాడు. అత్తమామలు వేధిస్తున్నారు. విచారించి తగిన చర్యలు తీసుకోవాలని బిట్రగుంటకు చెందిన ఓ మహిళ వినతిపత్రమిచ్చారు.
● అనుమతి లేకుండా నా పొలంలో పెద్దకుమారుడు, కోడలు, మనుమడు నారు వేశారు. ఇదేంటని అడిగితే దాడిచేశారు. విచారించి చర్యలు తీసుకోవాలని కోట పరిధికి చెందిన ఓ వృద్ధురాలు కోరారు.
● నా కుమార్తె ఈనెల 3వ తేదీ నుంచి కనిపించడం లేదు. ఆమె ఆచూకీ కనుక్కోవాలని కలిగిరికి చెందిన ఓ మహిళ అర్జీ ఇచ్చారు.
● నాపై మజ్ముల్ అనే వ్యక్తి దాడిచేసి గాయపరిచాడు. ప్రస్తుతం కేసు కోర్టులో విచారణలో ఉంది. కేసు ఉపసంహరించుకోవాలని మనుషులతో బెదిరిస్తున్నాడని చిన్నబజారుకు చెందిన ఓ వ్యక్తి ఫిర్యాదు చేశాడు.


