● బైక్పై వెళ్తూ కింద పడిన యువకుడు
● అతని పైనుంచి వెళ్లిన బస్సు
● అక్కడికక్కడే మృతి
వింజమూరు(ఉదయగిరి): రోడ్డు ప్రమాదంలో అనుమసముద్రంపేట మండలం రాజోలు గ్రామానికి చెందిన వింజమూరు కూరపాటి సురేంద్ర (27) మృతిచెందాడు. ఈ ఘటన వింజమూరు పట్టణంలో చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం మేరకు.. రాజోలు గ్రామానికి చెందిన సురేంద్ర ఆత్మకూరులోని అపోలో మెడికల్ షాపులో పనిచేసేవాడు. ఒకటిన్నర నెల క్రితం వింజమూరు అపోలో మెడికల్ షాపులో విధుల్లో చేరాడు. సోమవారం రాత్రి బంగ్లా సెంటర్కు మోటార్బైక్పై బయలుదేరాడు. వైఆర్జేసీ కాలేజీ సమీపంలో ఉన్న స్పీడ్ బ్రేకర్ వద్ద సిమెంట్ రోడ్డు మార్జిన్ సక్రమంగా లేకపోవడంతో ప్రమాదవశాత్తు జారి కింద పడ్డాడు. ఇదే సమయంలో ఉదయగిరి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు వింజమూరు బస్టాండ్ నుంచి ఉదయగిరి వెళ్తోంది. స్పీడ్ బ్రేకర్ వద్ద సురేంద్రపై ముందు చక్రాలు వెళ్లడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. సురేంద్రకు భార్య, రెండేళ్ల వయస్సున్న కుమార్తె ఉన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆత్మకూరుకు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేశారు. సిమెంట్ రోడ్డు మార్జిన్లకు ఇరువైపులా మట్టి పోసే విషయంలో ఆర్అండ్బీ అధికారులు నిర్లక్ష్యం వహించడతో ఈ ప్రమాదం చోటుచేసుకుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


