ఓర్లియాన్స్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీ మహిళల సింగిల్స్ విభాగంలో భారత రైజింగ్ స్టార్స్ తన్వీ శర్మ, ఇషారాణి బారువా సెమీఫైనల్లోకి దూసుకెళ్లారు. ఫ్రాన్స్లో శుక్రవారం జరిగిన తొలి క్వార్టర్ ఫైనల్లో 17 ఏళ్ల తన్వీ 21–14, 21–14తో ఆరో సీడ్ నత్సుకి నిదైరా (జపాన్)పై సంచలన విజయం సాధించింది.
43 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో రెండు గేముల్లోనూ తన్వీ పూర్తి ఆధిపత్యం చలాయించింది. మరో క్వార్టర్ ఫైనల్లో ఇషారాణి 21–9, 15–7తో భారత్కే చెందిన మాళవిక బన్సోద్పై గెలిచింది. రెండో గేమ్ మధ్యలో గాయం కారణంగా మాళవిక వైదొలిగింది. పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో హరిహరన్–అర్జున్ (భారత్) ద్వయం 12–21, 20–22తో లియో కార్నాండో–మౌలానా బాగస్ (ఇండోనేసియా) జంట చేతిలో ఓడిపోయింది.


