అతను చాలా డేంజరస్‌ ప్లేయర్‌: సచిన్‌

Surya Kumar Yadav Special And Very Dangerous, Sachin - Sakshi

ముంబై: ఐపీఎల్‌ సీజన్‌లో భాగంగా రెండు రోజుల క్రితం రాజస్తాన్‌ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ 57 పరుగుల తేడాతో విజయం సాధించడంపై మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌ ప్రశంసలు కురిపించాడు. అటు బ్యాటింగ్‌, ఇటు బౌలింగ్‌లోనూ ఆకట్టుకున్న ముంబై పల్టాన్‌కు ఇదొక అద్భుత విజయమన్నాడు. అదే సమయంలో ముంబై భారీ స్కోరు చేయడంలో సహకరించిన సూర్యకుమార్‌  యాదవ్‌ను సచిన్‌ ప్రత్యేకంగా కొనియాడాడు. ‘సూర్యకుమార్ ప్రత్యేకమైన క్రికెటర్‌. చాలా డేంజరస్‌ ఆటగాడు. గ్రౌండ్‌ నలుమూలాల షాట్లు ఆడే క్రికెటర్‌ సూర్యకుమార్‌ యాదవ్‌’ అని సచిన్‌ ప్రశంసించాడు. ఈ మేరకు తన ట్వీటర్‌ అకౌంట్‌లో ముంబైకి అభినందనలు తెలిపాడు సచిన్‌. ఇక పేస్‌ బౌలింగ్‌లో రాణించిన జస్‌ప్రీత్‌ బుమ్రాను ఆకాశానికెత్తేశాడు. ‘అతని స్పెల్‌ ఒక అసాధారణం. రెగ్యులర్‌ విరామాల్లో వికెట్లు తీస్తూ రాజస్తాన్‌పై ఒత్తిడి పెంచాడు. బుమ్రా బౌలింగ్‌ను ఎంజాయ్‌ చేశా’ అని సచిన్‌ మరొక ట్వీట్‌లో పేర్కొన్నాడు.(చదవండి: డైలమాలో సన్‌రైజర్స్‌!)

మంగళవారం రాజస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ భారీ విజయాన్ని నమోదు చేసింది. ఆ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌ చేసిన ముంబై ఇండియన్స్‌ నాలుగు వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది. సూర్యకుమార్‌ యాదవ్‌(79 నాటౌట్‌ 47 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్స్‌లు), రోహిత్‌ శర్మ(35; 23 బంతుల్లో  2 ఫోర్లు, 3 సిక్స్‌లు)లు రాణించడంతో పోరాడే స్కోరును బోర్డుపై ఉంచింది. అనంతరం రాజస్తాన్‌ను 18.1 ఓవర్లలో 136 ఆలౌట్‌ చేసి మరో గెలుపును ఖాతాలో వేసుకుంది. రాజస్తాన్‌ను ఏ దశలోనూ తేరుకోనివ్వకుండా చేసి విజయకేతనం ఎగురవేసింది. రాజస్తాన్‌ రాయల్స్‌ ఆటగాళ్లలో జోస్‌ బట్లర్‌(70; 44 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్‌లు) మినహా ఎవరూ రాణించలేదు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top