ఎవరైనా రూ.12.5 కోట్లు వదులుకుంటారా: రైనా | Srinivasan Says I Treat Raina Like My Own Son | Sakshi
Sakshi News home page

‘అద్భుతమైన కెప్టెన్‌ ఉండగా మాకేం అవసరం’

Sep 2 2020 6:26 PM | Updated on Sep 2 2020 7:55 PM

Srinivasan Says I Treat Raina Like My Own Son - Sakshi

ముంబై: అంతర్జాతీయ క్రికెట్‌కు మహేంద్ర సింగ్‌ ధోని గుడ్‌బై ప్రకటించిన వెంటనే సురేశ్‌ రైనా రిటైర్‌మెంట్‌ ప్రకటించి అందరిని ఆశ్చర్యపరిచారు. అయితే త్వరలో యూఏఈ వేదికగా జరిగే ఐపీఎల్‌లో సీఎస్‌కే(చెన్నై సూపర్‌కింగ్స్‌) తరుపున రైనా ఆడతాడని అందరు భావించారు. తన మేనమామ దారుణ హత్య నేపథ్యంలో హుటాహుటిన భారత్‌కు బయల్దేరాడు. అయితే సీఎస్‌కే యజమాని ఎన్‌.శ్రీనివాసన్‌తో పొసగకనే రైనా ఇంటిబాట పట్టాడని పుకార్లు వచ్చాయి. అయితే రైనా మాత్రం శ్రీనివాసన్‌ తనకు తండ్రి లాంటివారని చెబుతున్నాడు. ఈ అంశంపై ఎన్‌.శ్రీనివాసన్‌ స్పందిస్తూ.. రైనా చెప్పింది నిజమేనని, అతనిని తన సొంత కొడుకు లాగా చూసుకున్నట్లు శ్రీనివాసన్‌ తెలిపారు.

శ్రీనివాసన్‌ మాట్లాడుతూ.. ఐపీఎల్‌లో సీఎస్‌కే వరుస విజయాలకు ప్రధాన కారణం ఆటగాళ్ల వ్యక్తిగత వ్యవహారాల్లో జోక్యం చేసుకోకపోవడమే అని తెలిపారు. గత నలబై సంవత్సరాలుగా ఇండియా సిమెంట్స్ క్రికెట్‌ ఫ్రాంచైజీలతో సంబంధం ఉంది. ఐపీఎల్‌లో రైనా ఆడాలని కోరుకుంటున్నారా అనే ప్రశ్నకు శ్రీనివాసన్‌ స్పందిస్తూ.. తాము టీమ్‌ను మాత్రమే ఫ్రాంచైజీగా(కొనుగోలు) తీసుకున్నామని, ఆటగాళ్లను కాదని తెలిపారు. కాగా రైనా ఐపీఎల్‌లో ఆడతాడో లేదో తాను చెప్పలేనని, తాను జట్టుకు కెప్టెన్‌ను కాదని అన్నారు. సీఎస్‌కేకు అద్భుతమైన కెప్టెన్‌ ఉండగా ఆటగాళ్ల వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని శ్రీనివాసన్‌ పేర్కొన్నాడు.

అయితే తాజాగా రైనా స్పందిస్తూ తనకు, చెన్నై టీంకు ఎలాంటి విభేదాలు లేవని తెలిపారు. కుటుంబం కోసమే ఐపీఎల్‌ నుంచి వెనక్కొచ్చానని పేర్కొన్నాడు. తనకు సీఎస్‌కే తో రూ.12.5 కోట్ల కాంట్రాక్టు ఉందని, చిన్న కారణాలతో ఎవరైనా రూ.12.5 కోట్లు వదులుకుంటారా అని ప్రశ్నించారు. శ్రీనివాసన్‌ తనకు తండ్రిలాంటి వారని, ఆయన తనకు అండగా నిలిచారని  ఒకవేళ వీలు కుదిరితే ఈ సీజన్‌లోనే చెన్నైకి ఆడతానని రైనా స్పష్టం చేశారు. చదవండి: రైనా ఎగ్జిట్‌కు ప్రధాన కారణం అదేనా?

Advertisement
 
Advertisement
Advertisement