లంక ప్రీమియర్‌ లీగ్‌లో సొహైల్‌ ఖాన్‌ పెట్టుబడి | Sohail Khan buys Lanka Premier League Kandy franchise | Sakshi
Sakshi News home page

లంక ప్రీమియర్‌ లీగ్‌లో సొహైల్‌ ఖాన్‌ పెట్టుబడి

Oct 22 2020 5:45 AM | Updated on Oct 22 2020 5:45 AM

Sohail Khan buys Lanka Premier League Kandy franchise - Sakshi

ముంబై: లంక ప్రీమియర్‌ లీగ్‌ (ఎల్‌పీఎల్‌) టి20 టోర్నమెంట్‌లో బాలీవుడ్‌ స్టార్‌ సల్మాన్‌ ఖాన్‌ సోదరుడు నటుడు, నిర్మాత సొహైల్‌ ఖాన్‌ పెట్టుబడి పెట్టాడు. ‘క్యాండీ టస్కర్స్‌’ ఫ్రాంచైజీని సొహైల్‌ ఖాన్, అతని తండ్రి సలీమ్‌ ఖాన్‌కు చెందిన కన్సార్టియం ‘సొహైల్‌ ఖాన్‌ ఇంటర్నేషనల్‌ ఎల్‌ఎల్‌పీ’ సొంతం చేసుకుంది. ఈ విషయాన్ని సొహైల్‌ ఖాన్‌ అధికారికంగా ప్రకటించాడు. ‘ఎల్‌పీఎల్‌కు మంచి భవిష్యత్‌ ఉంది. ఇందులో భాగం కావడం సంతోషాన్నిచ్చింది. ఆట పట్ల లంక అభిమానులు ఉత్సుకతతో ఉంటారు.

జట్టుకు మద్దతు ఇవ్వడానికి వారంతా మా వెంటే ఉంటారని నమ్ముతున్నా’ అని సొహైల్‌ పేర్కొన్నాడు. నవంబర్‌ 21 నుంచి డిసెంబర్‌ 13 వరకు జరుగనున్న ఈ ఎల్‌పీఎల్‌లో ఐదు జట్లు కొలంబో కింగ్స్, దంబుల్లా హాక్స్, గాలె గ్లాడియేటర్స్, జాఫ్నా స్టాలియన్స్, క్యాండీ టస్కర్స్‌ తలపడనున్నాయి. లీగ్‌ కోసం రెండు రోజులుగా జరిగిన ఆటగాళ్ల వేలంలో టస్కర్స్‌ జట్టు వెస్టిండీస్‌ స్టార్‌ క్రిస్‌ గేల్‌ను దక్కించుకుంది. గేల్‌తో పాటు ఫ్లంకెట్, వహాబ్‌ రియాజ్, కుశాల్‌ పెరీరా, కుశాల్‌ మెండిస్, నువాన్‌ ప్రదీప్‌లు టస్కర్స్‌ జట్టుకు ప్రాతినిధ్యం వహించనున్నారు. శ్రీలంక మాజీ కెప్టెన్‌ హసన్‌ తిలకరత్నే ఈ జట్టు కోచింగ్‌ బృందంలో పనిచేయనున్నాడు.

ఎల్‌పీఎల్‌లో పాల్గొనే  ప్రముఖ ఆటగాళ్లు
జాఫ్నా స్టాలియన్స్‌: షోయబ్‌ మాలిక్‌.
దంబుల్లా హాక్స్‌: డేవిడ్‌ మిల్లర్, కార్లోస్‌ బ్రాత్‌వైట్‌.
కొలంబో కింగ్స్‌: రసెల్, డుప్లెసిస్, ఏంజె లో మాథ్యూస్‌.
గాలె గ్లాడియేటర్స్‌: లసిత్‌ మలింగ, అఫ్రిది, ఇంగ్రామ్, మొహమ్మద్‌ ఆమీర్‌

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement