కోహ్లి ఓపెనింగ్‌ చేస్తే నాకు అభ్యంతరమేంటి! | Rohit Sharma Says I Welcome My Partner Virat Kohli As Opener In T20s | Sakshi
Sakshi News home page

కోహ్లి ఓపెనింగ్‌ చేస్తే నాకు అభ్యంతరమేంటి!

Mar 21 2021 11:37 AM | Updated on Mar 21 2021 2:07 PM

Rohit Sharma Says I Welcome My Partner Virat Kohli As Opener In T20s - Sakshi

బయట ఏం అనుకుంటున్నారనేది మాకు అనవసరం.. ఓపెనింగ్‌లో ఎవరు ఆడాలి.. ఆడకూడదనేది నిర్ణయించే హక్కు కెప్టెన్‌ది‌

అహ్మదాబాద్‌: ఇంగ్లండ్‌తో ముగిసిన ఐదో టీ20లో టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి ఓపెనర్‌గా వచ్చి ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. హిట్‌మాన్‌ రోహిత్‌తో కలిసి తొలి వికెట్‌కు 54 బంతుల్లోనే 94 పరుగులు జోడించి జట్టుకు శుభారంభం అందించాడు. రోహిత్‌ అవుటైన తర్వాత మరింత బాధ్యతగా ఆడిన కోహ్లి 52 బంతుల్లో 80 నాటౌట్‌; 7 ఫోర్లు, 2 సిక్సర్లతో నాటౌట్‌గా నిలిచాడు. కేఎల్‌ రాహుల్‌ ఓపెనర్‌గా విఫలం కావడంతో కోహ్లి తానే ఓపెనర్‌గా రావాలనే నిర్ణయాన్ని తీసుకున్నాడు. ఐపీఎల్‌లోనూ ఆర్‌సీబీ తరపున కోహ్లి ఎన్నోసార్లు ఓపెనర్‌గా ఆడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీమిండియా వైస్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ వర్చువల్‌ ప్రెస్‌మీట్‌లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

''కోహ్లి ఓపెనర్‌గా వస్తే నాకు అభ్యంతరం ఎందుకుంటుంది. మ్యాచ్‌ గెలవాలనే ప్రయత్నంలోనే ఇలాంటి ప్రయోగాలకు సిద్ధపడుతుంటాం. ఇక కోహ్లి నిర్ణయాన్ని నేను స్వాగతిస్తా. జట్టుకు అవసరమైన దశలో ఒక బ్యాట్స్‌మన్‌ బ్యాటింగ్‌ ఆర్డర్‌లో ఏ స్థానంలోనైనా వచ్చేందుకు సిద్ధంగా ఉండాలి. అదే కోహ్లి చేశాడు.. తాను ఓపెనర్‌గా రాణించగలనన్న నమ్మ​కం కోహ్లికి ఉండడం.. అతనికున్న అదనపు బలం. జట్టులో ఒక కెప్టెన్‌ ఈ విధంగా ఉంటేనే మ్యాచ్‌లు గెలవగలం.

బయట ఏం అనుకుంటున్నారనేది మాకు అనవసరం.. ఓపెనింగ్‌లో ఎవరు ఆడాలి.. ఎవరు ఆడకూడదనేది నిర్ణయించే హక్కు కెప్టెన్‌కు ఉంటుంది. ఫామ్‌లో ఉన్న ఆటగాడు ఓపెనర్‌గా వచ్చినా.. వన్‌డౌన్‌లో వచ్చినా ఆడేది మాత్రం అతనే కదా. ఇషాన్‌ కిషన్‌ ఓపెనర్‌గా సక్సెస్‌ అయ్యాడు.. కోహ్లి కూడా సక్సెస్‌ అయ్యాడు. జట్టు ప్రయోజనాల కోసం కోహ్లి ఓపెనర్‌గా వస్తే నాకు అభ్యంతరం ఎందుకుంటుంది. అయినా ఇప్పుడు మా దృష్టి అంతా రానున్న టీ20 ప్రపంచకప్‌పైనే ఉంది. ఐపీఎల్‌ ముగిసిన తర్వాత మా గేమ్‌ ఫోకస్‌ను దానిపైనే పెట్టనున్నాం. అందుకే అన్ని రకాల ప్రయోగాలకు సిద్ధమవుతున్నాం ''అంటూ చెప్పుకొచ్చాడు.

ఇక ఐదో టీ20లో రోహిత్‌ శర్మ మెరుపు ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. (34 బంతుల్లో 64; 4 ఫోర్లు, 5 సిక్సర్లు) అర్ధ సెంచరీ సాధించగా... హార్దిక్‌ పాండ్యా (17 బంతుల్లో 39 నాటౌట్‌; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), సూర్యకుమార్‌ యాదవ్‌ (17 బంతుల్లో 32; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించారు. దీంతో టీమిండియా 20 ఓవరల్లో 2వికెట్ల నష్టానికి 224 పరుగులు చేసింది. అనంతం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్‌ 20 ఓవర్లో 8 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది . డేవిడ్‌ మలాన్‌ 68, బట్లర్‌ 52 మినహా మిగతావారు విఫలం  కావడంతో ఇంగ్లండ్‌ 36 పరుగుల తేడాతో పరాజయం చవిచూసింది. ఐదు టీ20ల సిరీస్‌ను టీమిండియా 3-2 తేడాతో కైవసం చేసుకుంది.
చదవండి:
టాప్‌ 2కు దూసుకొచ్చిన రోహిత్‌.. మొదటి స్థానంలో కోహ్లి
2016 తర్వాత మూడోసారి.. స్వదేశంలో రెండోసారి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement