గాల్లోకి ఎగిరి.. ఒంటిచేత్తో రోహిత్‌ సంచలన క్యాచ్‌! | Rohit Sharma Plucks One Handed Scorcher Team India Players In Disbelief Video | Sakshi
Sakshi News home page

ఒంటిచేత్తో రోహిత్‌ సంచలన క్యాచ్‌.. షాక్‌లో సహచరులు! వీడియో

Sep 30 2024 2:00 PM | Updated on Sep 30 2024 2:50 PM

Rohit Sharma Plucks One Handed Scorcher Team India Players In Disbelief Video

PC: BCCI/Jio Cinema

బంగ్లాదేశ్‌తో రెండో టెస్టులో టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ సంచలన క్యాచ్‌తో మెరిశాడు. అద్భుత రీతిలో ఒంటిచేత్తో బంతిని ఒడిసిపట్టి అభిమానులకు కనువిందు చేశాడు. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ 2023-25 సీజన్‌లో భాగంగా భారత క్రికెట్‌ జట్టు సొంతగడ్డపై బంగ్లాదేశ్‌తో రెండు మ్యాచ్‌ల సిరీస్‌ ఆడుతోంది. చెన్నైలో జరిగిన తొలి టెస్టులో గెలుపొంది.. 1-0తో ఆధిక్యంలో ఉన్న రోహిత్‌ సేన.. ప్రస్తుతం కాన్పూర్‌లో రెండో మ్యాచ్‌ ఆడుతోంది.

233 పరుగులకు బంగ్లా ఆలౌట్‌
శుక్రవారం మొదలైన ఈ మ్యాచ్‌లో గ్రీన్‌ పార్క్‌ స్టేడియంలో టాస్‌ గెలిచిన టీమిండియా.. బంగ్లాదేశ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. అయితే, వర్షం కారణంగా తొలి రోజు 35 ఓవర్ల ఆటే సాధ్యపడగా.. రెండు, మూడో రోజు ఒక్క బంతి కూడా పడకుండానే ఆట రద్దై పోయింది. ఈ క్రమంలో సోమవారం వరణుడు కరుణించడంతో మ్యాచ్‌ మళ్లీ మొదలైంది. ఇందులో భాగంగా బంగ్లాదేశ్‌ 74.2 ఓవర్లలో 233 పరుగులు చేసి ఆలౌట్‌ అయింది.

అయితే, బంగ్లా ఇన్నింగ్స్‌లో భారత కెప్టెన్‌ రోహిత్‌ శర్మ అందుకు సింగిల్‌ హ్యాండెడ్‌ క్యాచ్‌ సహచరులతో పాటు.. ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లనూ ఆశ్చర్యపరిచింది. 50వ ఓవర్‌లో టీమిండియా పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ వేసిన బంతిని బంగ్లా బ్యాటర్‌ లిటన్‌ దాస్ బౌండరీకి తరలించాలనే యోచనతో షాట్‌ బాదినట్లు కనిపించింది. 

ఒక్క ఉదుటున పైకెగిరి ఒంటిచేత్తో క్యాచ్‌
ఈ క్రమంలో 30 యార్డ్‌ సర్కిల్‌ లోపలి ఫీల్డింగ్‌ పొజిషన్‌లో ఉన్న రోహిత్‌.. తన తల మీదుగా వెళ్తున్న బంతిని ఒక్క ఉదుటన పైకెగిరి ఒంటిచేత్తో క్యాచ్‌ అందుకున్నాడు.  దీంతో సిరాజ్‌తో పాటు లిటన్‌ దాస్‌, భారత ఫీల్డర్లు నమ్మలేమన్నట్లుగా షాకింగ్‌ రియాక్షన్‌ ఇచ్చారు. అలా లిటన్‌దాస్‌(13) రూపంలో బంగ్లాదేశ్‌ ఐదో వికెట్‌ కోల్పోయింది. 

బంగ్లా తొలి ఇన్నింగ్స్‌లో భారత పేసర్లు జస్‌ప్రీత్‌ బుమ్రా మూడు, సిరాజ్‌ రెండు, ఆకాశ్‌ దీప్‌ రెండు వికెట్లు దక్కించుకోగా.. స్పిన్నర్లు రవిచంద్రన్‌ అశ్విన్‌ రెండు, రవీంద్ర జడేజా ఒక వికెట్‌ తీశారు. ఇక తొలి ఇన్నింగ్స్‌ను దూకుడుగా ఆరంభించిన టీమిండియా 55 పరుగుల వద్ద తొలి వికెట్‌ కోల్పోయింది. మెహది హసన్‌ మిరాజ్‌ బౌలింగ్‌లో రోహిత్‌ శర్మ 23 పరుగుల వద్ద నిష్క్రమించాడు.

చదవండి: పూరన్‌ సుడిగాలి శతకం

Advertisement
 
Advertisement
Advertisement