RCB Vs LSG: RCB Lost 5 Matches After Scoring 200 Plus, Most By Any Team In IPL History - Sakshi
Sakshi News home page

IPL 2023 RCB VS LSG: అట్లుంటది ఆర్సీబీ గ్రహచారం.. ఎంత చేసినా అంతే, చెత్త రికార్డు

Apr 11 2023 1:00 PM | Updated on Apr 11 2023 1:38 PM

RCB Lost 5 Matches After Scoring 200 Plus, Most By Any Team In IPL - Sakshi

pic credit: IPL twitter

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో అత్యంత దురదృష్టమై జట్టు ఏదైనా ఉందా అంటే అది రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరేనని చెప్పాలి. ఆరంభ సీజన్‌ నుంచి జట్టు నిండా దిగ్గజాలు ఉన్నా ఆ జట్టు ఇప్పటివరకు ఒక్కటంటే ఒక్క టైటిల్‌ కూడా సాధించలేదు. ప్రతి ఏడాది 'ఈ సాలా కప్‌ నమదే' (ఈ ఏడాది కప్‌ మనదే) అని ఫ్యాన్స్‌ను ఊరించే ఈ జట్టు.. ప్రతి యేడు భారీ అంచనాల మధ్య బరిలోకి దిగి ఉసూరుమనిపిస్తుంది.

ఈ టీమ్‌ ఎప్పుడు ఎలా ఆడుతుందో ఎవరికీ అర్ధం కాదు. కొన్ని సందర్భాల్లో అతి భారీ లక్ష్యాలను తృణప్రాయంగా ఛేదిస్తుంది. కొన్ని సందర్భాల్లో అత్యంత పేలవమైన ఆటతీరుతో దారుణంగా నిరాశపరుస్తుంది. ఇంకొన్ని సందర్భాల్లో తొలుత బ్యాటింగ్‌ చేసి అత్యంత భారీ స్కోర్లు చేసే ఈ జట్టు, వాటిని డిఫెండ్‌ చేసుకోలేక చతికిలపడుతుంది. ఇలాంటి ఘటనే ఐపీఎల్‌-2023లో నిన్న జరిగింది.

తమకు అచ్చొచ్చిన చిన్నస్వామి స్టేడియంలో లక్నోతో జరిగిన మ్యాచ్‌లో 212 పరుగుల భారీ లక్ష్యాన్ని డుప్లెసిస్‌ సేన డిఫెండ్‌ చేసుకోలేక ఓటమిపాలైంది. నరాలు తెగే ఉత్కంఠ నడుమ సాగిన ఈ మ్యాచ్‌లో లక్నో చివరి బంతికి విజయం సాధించి, ఆర్సీబీ దృరదృష్టాన్ని మరోసారి గుర్తు చేసింది. థ్రిల్లర్‌ సినిమాను తలపించిన ఈ మ్యాచ్‌లో ఓటమితో ఆర్సీబీ తమ దురదృష్టాన్ని మరింత మెరుగుపర్చుకుంది.

ఐపీఎల్‌ చరిత్రలో అత్యధిక సార్లు 200 అంతకంటే ఎక్కువ స్కోర్‌ చేసి దాన్ని డిఫెండ్‌ చేసుకోలే చతికిలపడిన దురదృష్ట జట్టుగా రికార్డుల్లో నిలిచింది. ఆర్సీబీ ఇప్పటివరకు 5 సందర్భాల్లో 200 ప్లస్‌ స్కోర్‌ చేసి దాన్ని డిఫెండ్‌ చేసుకోలేక ఓటమిపాలైంది. ఐపీఎల్‌లో మరే జట్టు ఇన్ని సార్లు ఇలా ఓటమిపాలవలేదు. ఆర్సీబీ తర్వాత సీఎస్‌కే 3 సార్లు, పంజాబ్‌, కేకేఆర్‌ తలో 2 సార్లు 200 ప్లస్‌ స్కోర్‌ను నిలువరించుకోలేపోయాయి. 

ఇదిలా ఉంటే, నరాలు తెగే ఉత్కంఠ నడుమ ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో లక్నో వికెట్‌ తేడాతో థ్రిల్లింగ్‌ విక్టరీ సాధించింది. అత్యంత నాటకీయ పరిణామాల మధ్య సాగిన ఈ మ్యాచ్‌లో లక్నో చివరి బంతికి విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆర్సీబీ.. విరాట్‌ కోహ్లి (44 బంతుల్లో 61; 4 ఫోర్లు, 4 సిక్సర్లు), డుప్లెసిస్‌ (46 బంతుల్లో 79 నాటౌట్‌; 5 ఫోర్లు, 5 సిక్సర్లు), మ్యాక్స్‌వెల్‌ (29 బంతుల్లో 59; 3 ఫోర్లు, 6 సిక్సర్లు) విధ్వంసం సృష్టించడంతో నిర్ణీత ఓవర్లలో వికెట్‌ నష్టానికి 212 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. 

అనంతరం 213 పరుగుల భారీ లక్ష్యఛేదనకు దిగిన లక్నో 23 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉండగా.. తొలుత స్టోయినిస్‌ (30 బంతుల్లో 65; 6 ఫోర్లు, 5 సిక్సర్లు), ఆతర్వాత  పూరన్‌ (18 బంతుల్లో 62; 4 ఫోర్లు, 7 సిక్సర్లు) చారిత్రక ఇన్నింగ్స్‌లు ఆ జట్టు గెలుపులో ప్రధాన పాత్ర పోషించారు. ఆఖర్లో హైడ్రామా నెలకొన్నప్పటికీ ఇన్నింగ్స్‌ చివరి బంతికి బై రావడంతో లక్నో వికెట్‌ తేడాతో విజయం సాధించింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement