టీమిండియాకు సంబంధించి ఓ కీలక అప్డేట్ అందుతోంది. ఐపీఎల్ 2026 ముగిసిన వెంటనే పంజాబ్ కింగ్స్ స్నిన్ బౌలింగ్ కోచ్ సాయిరాజ్ బహుతులే టీమిండియా కోఠరిలో అదే హోదాలో జాయిన్ కానున్నట్లు తెలుస్తుంది. ఈ విషయాన్ని ప్రముఖ క్రికెట్ వెబ్సైట్ క్రిక్బజ్ ఓ కథనంలో పేర్కొంది.
బహుతులే.. ఈ విషయమై టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్తోనూ చర్చించినట్లు సమాచారం. ప్రస్తుతం గంభీర్ హెడ్ కోచ్గా, సితాంశు కోటక్ బ్యాటింగ్ కోచ్గా, టెన్ డస్కట్ అసిస్టెంట్ కోచ్గా, మోర్నీ మార్కెల్ బౌలింగ్ కోచ్గా, దిలీప్ ఫీల్డింగ్ కోచ్గా వ్యవహరిస్తున్నారు. స్పిన్ బౌలింగ్ కోచ్ పదవి గతకొంతకాలంగా ఖాళీగా ఉంది. ఈ ఖాళీని బహుతులేతో భర్తీ చేయాలని బీసీసీఐ నిర్ణయించినట్లు తెలుస్తోంది.
53 ఏళ్ల బహుతులే దేశీయ క్రికెట్లో మంచి లెగ్ స్పిన్నర్గా పేరు సంపాదించాడు. 343 దేశీయ మ్యాచ్ల్లో 837 వికెట్లు తీశాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అతడు 9 సెంచరీలు, 26 హాఫ్ సెంచరీల సాయంతో 6176 పరుగులు సాధించాడు. దేశవాలీ క్రికెట్ను ముంబై, మహారాష్ట్ర, అస్సాం జట్ల తరఫున ఆడిన బహుతులే.. అంతర్జాతీయంగా 2 టెస్టులు, 8 వన్డేలు ఆడి 5 వికెట్లు తీశాడు.
కోచింగ్ అనుభవం:
- 2021లో ఇండియా-ఏ జట్టు దక్షిణాఫ్రికా పర్యటనలో బౌలింగ్ కోచ్గా పని చేశాడు.
- బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్లో నాలుగు సంవత్సరాలు బౌలింగ్ కోచ్గా పని చేశాడు.
- రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్లతో పాటు కేరళ, బెంగాల్, గుజరాత్ జట్లకు హెడ్ కోచ్గా కూడా పనిచేశాడు.
రికీ పాంటింగ్ హెడ్ కోచ్గా ఉన్న పంజాబ్ కింగ్స్లో బహుతులే స్పిన్ బౌలింగ్ కోచ్గా మంచి సేవలందిస్తున్నాడు. అతడి మార్గదర్శకత్వంలో పంజాబ్ స్పిన్ విభాగం (యుజ్వేంద్ర చాహల్, హర్ప్రీత్ బ్రార్) అద్భుతంగా రాణిస్తుంది. ఈ అనుభవం భారత జాతీయ జట్టు స్పిన్నర్ల అభివృద్ధికి ఉపయోగపడుతుందని బీసీసీఐ భావిస్తోంది.


