
కాన్వేకు దక్కని చోటు
ముక్కోణపు టి20 టోర్నీకి న్యూజిలాండ్ జట్టు ఎంపిక
వెల్లింగ్టన్: జాతీయ కాంట్రాక్ట్ తీసుకునేందుకు నిరాకరించిన న్యూజిలాండ్ సీనియర్ ఓపెనర్ డెవాన్ కాన్వేను... ముక్కోణపు టి20 టోర్నమెంట్కు ఎంపిక చేయలేదు. వచ్చేనెలలో దక్షిణాఫ్రికా, జింబాబ్వేతో కలిసి న్యూజిలాండ్ జట్టు టి20 టోర్నమెంట్ ఆడనుంది. ఈ ముక్కోణపు పోటీకి జింబాబ్వే ఆతిథ్యమిస్తుండగా... దీని కోసం న్యూజిలాండ్ బోర్డు శుక్రవారం 15 మందితో కూడిన జట్టును ప్రకటించింది. ఇందులో సీనియర్ ఓపెనర్ కాన్వేకు చోటు దక్కలేదు. ఫ్రాంచైజీ క్రికెట్ ఆడేందుకు వీలుగా అతడు జాతీయ కాంట్రాక్ట్ను వదులుకోగా... ఈ టోర్నీకి అందుబాటులో ఉండనని మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్ ప్రకటించాడు.
అతడు ప్రస్తుతం ఇంగ్లండ్ కౌంటీ చాంపియన్షిప్లో మిడిలెసెక్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. 23 ఏళ్ల బెవాన్ జాకబ్కు మరో అవకాశం దక్కింది. శ్రీలంకతో సిరీస్కు కూడా అతడిని ఎంపిక చేసినా... మ్యాచ్ ఆడే అవకాశం దక్కలేదు. మేజర్ లీగ్ క్రికెట్లో మెరుగైన ప్రదర్శన చేస్తున్న ఆడమ్ మిల్నే, టిమ్ సీఫెర్ట్, ఫిన్ అలెన్లను తిరిగి జట్టులోకి వచ్చారు. అలెన్ ఇటీవల ఈ లీగ్లో ఒకే ఇన్నింగ్స్లో 19 సిక్స్లు కొట్టి ప్రపంచ రికార్డు సృష్టించాడు.
గత ఏడాది ఫిబ్రవరిలో ఆస్ట్రేలియాతో జరిగిన టి20లో చివరిసారి మిల్నే న్యూజిలాండ్ తరఫున బరిలోకి దిగాడు. ఈ జట్టుకు మిచెల్ సాంట్నర్ సారథ్యం వహించనున్నాడు. ‘ముక్కోణపు టోర్నీ కోసం బలమైన జట్టును ఎంపిక చేశాం. ఐపీఎల్ కారణంగా పాకిస్తాన్తో జరిగిన సిరీస్కు అందుబాటులో లేని పలువురు ఆటగాళ్లు ఈ టోర్నీ బరిలోకి దిగనున్నారు. వారంతా మెరుగైన ప్రదర్శన కనబరుస్తారనే నమ్మకముంది’ అని న్యూజిలాండ్ హెడ్ కోచ్ రాబ్ వాల్టర్ అన్నాడు. వచ్చే నెల 14–26 వరకు రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో మూడు జట్ల మధ్య ఈ టోర్నీ జరగనుంది.