వెల్లింగ్టన్ వేదికగా దక్షిణాఫ్రికా మహిళలతో జరిగిన రెండో వన్డేలో న్యూజిలాండ్ అమ్మాయిల జట్టు చారిత్రత్మక విజయాన్ని అందుకుంది. సౌతాఫ్రికా నిర్ధేశించిన 347 పరుగుల లక్ష్యాన్ని చేధించి భారత్ పేరిట ఉన్న వరల్డ్ రికార్డును కివీస్ తిరగరాసింది. మహిళల వన్డే క్రికెట్ చరిత్రలో అత్యధిక రన్ ఛేజ్ చేసిన జట్టుగా న్యూజిలాండ్ రికార్డులెక్కింది.
ఇంతకుముందు వరకు ఈ రికార్డు భారత మహిళల జట్టు పేరిట ఉండేది. వన్డే ప్రపంచకప్-2025లో ఆస్ట్రేలియాతో జరిగిన సెమీఫైనల్లో ఉమెన్ ఇన్ బ్లూ.. 339 పరుగులు టార్గెట్ను చేజ్ చేసింది. ఇప్పుడు ఈ రికార్డును కివీస్ బ్రేక్ చేసింది.
ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 346 పరుగుల భారీ స్కోర్ సాధించింది. దక్షిణాఫ్రికా బ్యాటర్లలో అన్నేకే బోష్(91) టాప్ స్కోరర్గా నిలవగా.. కెప్టెన్ లారా వోల్వార్డ్(69), ట్రయోన్(52), జాఫ్టా(37) రాణించారు.
అదరగొట్టిన అమెలియా..
ఇక ఈ భారీ లక్ష్య చేధనలో కివీస్ కెప్టెన్ అమెలియా కెర్ అద్భుతం చేసింది. సుజీ బేట్స్(8), ప్లిమ్మర్(23), మ్యాడీ గ్రీన్(13) వంటి స్టార్ బ్యాటర్లు విఫలమైన చోట అమెలియా సంచలన ఇన్నింగ్స్ ఆడింది. ఓ వైపు క్రమం తప్పుకుండా వికెట్లు పడుతున్నప్పటికి కెర్ మాత్రం తన విధ్వంసకర బ్యాటింగ్ను కొనసాగించింది.
ఈ క్రమంలో అమెలియా కేవలం 90 బంతుల్లోనే తన ఐదువ వన్డే సెంచరీ మార్క్ను అందుకుంది. ఆఖరి ఓవర్లో 11 పరుగులు అవసరం కాగా.. అమెలియా కేర్ వరుసగా మూడు బౌండరీలు బాది తమ జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించింది. మొత్తంగా మహిళల వన్డే క్రికెట్లో లక్ష్య చేధనలో అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించిన రెండో ప్లేయర్గా కెర్ నిలిచింది. అదేవిధంగా న్యూజిలాండ్ గడ్డపై వన్డేల్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించిన ఉమెన్స్ ప్లేయర్గా కూడా కెర్ రికార్డు నెలకొల్పింది.
మహిళల వన్డేల్లో అత్యధిక రన్ ఛేజ్ చేసిన జట్లు ఇవే
న్యూజిలాండ్-347-ప్రత్యర్ధి- సౌతాఫ్రికా
భారత్-339- ప్రత్యర్ధి- ఆస్ట్రేలియా
ఆస్ట్రేలియా-331- ప్రత్యర్ధి భారత్
చదవండి: మాక్స్వెల్కు షాకిచ్చిన క్రికెట్ ఆస్ట్రేలియా


