మళ్లీ దెబ్బేసిన పతిరగే.. నీర‌జ్ చోప్రాకు ర‌జ‌తం | Neeraj Chopra-Throw Earns Silver Medal In Lausanne Diamond League 2026 | Sakshi
Sakshi News home page

మళ్లీ దెబ్బేసిన పతిరగే.. నీర‌జ్ చోప్రాకు ర‌జ‌తం

Aug 22 2026 6:57 AM | Updated on Aug 22 2026 7:30 AM

Neeraj Chopra-Throw Earns Silver Medal In Lausanne Diamond League 2026

Photo Credit: Twitter

భార‌త స్టార్ జావెలిన్ త్రోయ‌ర్ నీర‌జ్ చోప్రా లుసానే డైమండ్ లీగ్ మీట్‌లో ర‌జ‌తంతో మెరిశాడు. ఈటెను 88.05 మీట‌ర్లు విసిరిన నీర‌జ్ చోప్రా సీజ‌న్ బెస్ట్ త్రో న‌మోదు చేశాడు. కామ‌న్‌వెల్త్‌లో స్వ‌ర్ణంతో మెరిసిన లంక స్టార్ జావెలిన్ త్రోయ‌ర్ రుమేశ్ ప‌తిర‌గే మ‌రోసారి ప‌సిడి ప‌త‌కాన్ని కొల్ల‌గొట్టాడు. పతిరగే తన మూడో ప్రయత్నంలో  ఈటెను నీర‌జ్ కంటే 9 సెంటీమీట‌ర్లు ఎక్కువ దూరం విసిరాడు. 

దీంతో నీరజ్‌ స్కోరును దాటేసిన పతిరగే తొలి స్థానంలో నిలిచి భారత స్టార్‌ను మరోసారి దెబ్బకొట్టాడు. ఇక గ్రెనెడాకు చెందిన అండర్సన్‌ పీట‌ర్స్‌ మూడో ప్రయత్నంలో ఈటెను 86.61 మీట‌ర్ల దూరం విసిరి బెస్ట్‌ నమోదు చేయడంతో పాటు కాంస్య ప‌త‌కం సాధించాడు.

కామన్‌వెల్త్ గేమ్స్‌లో అంత ఫిట్‌గా కనిపించనప్పటికీ నీరజ్ చోప్రా రజతంతో మెరిశాడు. అయితే లుసానే డైమండ్ లీగ్‌లో మాత్రం నీరజ్ ఆత్మవిశ్వాసంతో కనిపించాడు. తొలి రౌండ్‌లో ఈటెను 83.54 మీటర్లు విసిరి మంచి స్టార్ట్ ఇచ్చాడు. ఇక రెండో రౌండ్‌లో 88.05 మీటర్లు విసిరిన నీరజ్ ఈ సీజన్‌లోనే బెస్ట్ ప్రదర్శన కనబరిచాడు.  

ఇక లంక స్టార్ పతిరగే 87.06 మీటర్లు విసిరి నీరజ్ తర్వాతి స్థానంలో నిలిచాడు. పీటర్స్ కూడా 84.76 మీటర్లు విసిరి మూడో స్థానంలో నిలిచాడు. మూడో రౌండ్‌లో నీరజ్ ఈటెను 83.72 మీటర్లు మాత్రమే విసరగలిగాడు.  కానీ పతిరగే మాత్రం ఈటెను 88.14 మీటర్లు విసిరి నీరజ్ స్కోరును దాటేసి అగ్రస్థానంలో నిలిచాడు. 

నాలుగో రౌండ్‌లో నీరజ్ ఫౌల్ చేయగా, పతిరగే మాత్రం 86.71 మీటర్ల దూరం విసిరాడు. ఇక పీటర్స్ మాత్రం నాలుగో రౌండ్‌లో ఈటెను 86.61 మీటర్లు విసిరి తన స్కోరును కాస్త పెంచుకున్నాడు. ఇక చివరి రౌండ్‌కు నీరజ్ దూరంగా ఉన్నాడు. అదే సమయంలో పతిరగే ఫౌల్ చేయగా, మిగతా అథ్లెట్లు 70 నుంచి 80 మీటర్ల మధ్యలోనే విసరడంతో నీరజ్‌కు రజతం ఖరారైంది.

కామన్వెల్త్‌ క్రీడలు ముగిసిన తర్వాత నీరజ్‌ స్విట్జర్లాండ్‌లోని బీల్‌లో ఉన్న తన శిక్షణా కేంద్రానికి వెళ్లిపోయాడు. తన కోచ్‌ జైవీర్‌ చౌధరీ, ఫిజియో ఇషాన్‌ మార్వా సమక్షంలో అతను రీహాబిలిటేషన్‌ను కొనసాగించడంతో పాటు ప్రాక్టీస్‌ కూడా చేస్తున్నాడు. బ్రసెల్స్‌లో జరిగే ఫైనల్స్‌కు ఆరుగురు త్రోయర్లు క్వాలిఫై అవుతారు. 

లుసానే తర్వాత తమ ర్యాంక్‌ను మెరుగపర్చుకునేందుకు ఆటగాళ్లకు ఈ నెల 27 నుంచి జ్యూరిచ్‌లో జరిగే అంచెలో కూడా అవకాశం ఉంది. 2022లో డైమండ్‌ లీగ్‌ చాంపియన్‌గా నిలిచిన నీరజ్, ఆ తర్వాత వరుసగా మూడేళ్ల పాటు రెండో స్థానంతో ముగించాడు. లుసానేలో టాప్‌–3లో నిలవడంతో తొలిసారి భారీ ప్రైజ్‌మనీ ఈవెంట్‌ వరల్డ్‌ అథ్లెటిక్స్‌ అల్టిమేట్‌ చాంపియన్‌షిప్‌లో పాల్గొనేందుకు నీరజ్‌కు  మార్గం సుగమమయింది.

 

చదవండి: 'భార‌త్‌, బ్రెజిల్ మ్యాచ్ బ‌హిష్క‌రించండి'

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement