Photo Credit: Twitter
అక్టోబర్లో భారత్, బ్రెజిల్ మధ్య స్నేహపూర్వక ఫుట్బాల్ మ్యాచ్ జరగనున్న సంగతి తెలిసిందే. కోల్కతాలోని సాల్ట్లేక్ స్టేడియం ఈ మ్యాచ్కు వేదిక కానుంది. ఈ నేపథ్యంలో భారత మాజీ ఫుట్బాల్ స్టార్ బైచుంగ్ భూటియా అభిమానులకు కీలక విజ్ఞప్తి చేశాడు. భారత్, బ్రెజిల్ ఫ్రెండ్లీ మ్యాచ్ నిర్వహణ కోసం రూ. 60 నుంచి 70 కోట్ల వరకు ఖర్చయ్యే అవకాశముందని, భారీగా ఖర్చు చేయాల్సి వస్తుండడంతో అభిమానులంతా ఈ ఫ్రెండ్లీ మ్యాచ్ను బహిష్కరించాలని పేర్కొన్నాడు.
భూటియా మాట్లాడుతూ.. ''బ్రెజిల్, భారత్ ఫుట్బాల్ మ్యాచ్ను బహిష్కరించండి. ఈ మ్యాచ్ను నిర్వహించాలనుకునే ప్రతి ఆర్గనైజర్, ప్రతి ఫెడరేషన్ ఒకటికి రెండుసార్లు ఆలోచించా. ఈ మ్యాచ్ కోసం బెంగాల్ ప్రభుత్వం నిధులు సమకూరుస్తుందా? లేక ఫండ్రైజింగ్ ద్వారా డబ్బు సేకరిస్తారా? అనేది స్పష్టంగా తెలియాలి.
ఈ మ్యాచ్ కోసం ఖర్చు చేసే డబ్బును వచ్చే కామన్వెల్త్ గేమ్స్లో మరిన్ని స్వర్ణ పతకాలు సాధించేందుకు ఉపయోగిస్తే బాగుంటుంది. మీ దగ్గర రూ.30 కోట్లు ఉంటే.. భారత్ వేదికగా జరగనున్న సీడబ్ల్యూజీ 2030 క్రీడల కోసం ఆ మొత్తాన్ని ఖర్చు చేయాలని నా విజ్ఞప్తి. మన దేశానికి ఒలింపిక్స్ను తీసుకురావాలని అనుకుంటున్నాం.
బెంగాల్ నుంచి మరింత మంది ఒలింపియన్లను తయారు చేసేందుకు ఆ డబ్బును వినియోగించాలి. బ్రెజిల్ జట్టు ఇక్కడికి ఉచితంగా వచ్చి ఆడితే నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ అందుకు మనమే భారీగా డబ్బు ఖర్చు చేయాల్సి వస్తే మాత్రం ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతాయి.
ఆ డబ్బును దేశవ్యాప్తంగా క్షేత్రస్థాయిలో ఫుట్బాల్ను అభివృద్ధి చేసేందుకు ఖర్చు చేస్తే మరింత ప్రయోజనం ఉంటుందనేది నా అభిప్రాయం" అని చెప్పుకొచ్చాడు. ఇక బైచుంగ్ భూటియా 1995 నుంచి 2011 వరకు భారత ఫుట్బాల్కు ప్రాతినిధ్యం వహించాడు. 83 మ్యాచ్లాడిన భూటియా 27 గోల్స్ చేశాడు.


