MS Dhoni Gifts Autographed Bat To Comedian Yogi Babu, Pic Goes Viral - Sakshi
Sakshi News home page

MS Dhoni: స్టార్‌​ కమెడియన్‌ యోగిబాబుకు ధోని గిఫ్ట్‌

Feb 16 2023 4:00 PM | Updated on Feb 16 2023 4:45 PM

MS Dhoni Autographed Bat Leaves Comedian Yogi-Babu Ecstatic - Sakshi

టీమిండియా మాజీ క్రికెటర్‌ ఎంఎస్‌ ధోనికి అభిమానులెక్కువ. ఈ విషయం ఇప్పటికే చాలాసార్లు నిరూపితమైంది. అభిమానులన్నా ధోనికి అమితమైన ప్రేమ. తన చర్యతో ఎన్నోసార్లు అభిమానులను సంతోషపెట్టిన దాఖలాలు ఉన్నాయి. ప్రముఖ కమెడియన్‌ యోగిబాబుకు కూడా ధోని అంటే విపరీతమైన అభిమానం.

ఐపీఎల్‌లో సీఎస్‌కే మ్యాచ్‌లు చెన్నైలో ఉన్నప్పుడల్లా యోగిబాబు క్రమం తప్పకుండా హాజరయ్యేవాడు. కేవలం ధోనిని చూసేందుకే మ్యాచ్‌లకు వచ్చేవాడు. ధోని ఆటోగ్రాఫ్‌ కోసం యోగిబాబు ట్రై చేసి విఫలమయ్యాడు. అయితే తాజాగా తాను ఆరాధించే ధోని.. స్వయంగా బ్యాట్‌పై ఆటోగ్రాఫ్‌ చేసి యోగిబాబుకు గిఫ్ట్‌గా ఇవ్వడం అతన్ని సంతోషపెట్టింది. ఆ బ్యాట్‌పై ''బెస్ట్‌ విషెస్‌... యోగిబాబు'' అని రాసి ధోని సంతకం చేశాడు.

ధోని ఆటోగ్రాఫ్‌ విషయాన్ని యోగిబాబు ట్విటర్‌ వేదికగా గర్వంగా చెప్పుకున్నాడు. ధోని సంతకం ఉన్న బ్యాట్‌ను ట్విటర్‌లో షేర్‌ చేస్తూ.. ''బ్యాట్‌ గిఫ్ట్‌గా ఇచ్చినందుకు థాంక్యూ ధోని సార్‌.. మీ క్రికెట్‌ జ్ఞాపకాలు నన్ను ఎప్పుడు వెంటాడుతూనే ఉంటాయి.'' అని క్యాప్షన్‌ జత చేశాడు. ఆ తర్వాత తాను నటిస్తున్న సినిమా టీంతో కలిసి ధోని ఆటోగ్రాఫ్‌ ఉన్న బ్యాట్‌తో ఫోటోలకు ఫోజిచ్చాడు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

ఇక ధోనికి.. ఈ ఏడాది జరగబోయే ఐపీఎల్‌ 2023 చివరిదని ప్రచారం జరగుతుంది. ఆరంభం నుంచి సీఎస్‌కేతో పాటే ఉన్న ధోని విజయవంతమైన కెప్టెన్‌గా నిలిచాడు. సీఎస్‌కేను నాలుగుసార్లు ఐపీఎల్‌ ఛాంపియన్‌గా నిలిపాడు. గతేడాది ఐపీఎల్‌లో ధోని తనంతట తానుగా కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకోవడంతో జడేజాకు పగ్గాలు అప్పగించారు. అయితే ఒత్తిడిని భరించలేక జడ్డూ సీజన్‌ మధ్యలోనే కెప్టెన్సీ నుంచి పక్కకు తప్పుకున్నాడు. దీంతో మళ్లీ ధోనినే జట్టును నడిపించాల్సి వచ్చింది.

గత సీజన్‌లో సీఎస్‌కే 14 మ్యాచ్‌ల్లో నాలుగు విజయాలు మాత్రమే నమోదు చేసి తొమ్మిదో స్థానంతో సరిపెట్టుకుంది. ఇప్పటికే ధోని తన ఐపీఎల్‌ ప్రాక్టీస్‌ను ఆరంభించిన సంగతి తెలిసిందే. తన స్వస్థలమైన రాంచీ స్టేడియంలో బ్యాటింగ్‌ ప్రాక్టీస్‌ చేసిన వీడియోలు బయటికొచ్చాయి. ఖాళీగా ఉన్న సమయాల్లో తన వ్యక్తిగత పనులపై కూడా దృష్టి సారించాడు. ఇటీవలే రాంచీ వేదికగా న్యూజిలాండ్‌, టీమిండియాల మధ్య జరిగిన టి20 మ్యాచ్‌కు ధోని కుటుంబంతో కలిసి హాజరయ్యాడు.

చదవండి: 'సర్‌' అనొద్దు.. అలా పిలవడాన్ని అసహ్యించుకుంటా'

Advertisement
 
Advertisement
Advertisement