Photo Courtesy: IPL 2026
శ్రీలంక క్రికెటర్ మతీశా పతీరానా ఐపీఎల్లో కేకేఆర్ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. డెత్ ఓవర్ల స్పెషలిస్ట్గా ముద్రపడిన పతీరానాను రూ. 18 కోట్లు పెట్టి కేకేఆర్ కొనుగోలు చేసింది. అయితే ఐపీఎల్ ప్రారంభానికి ముందే కాలి పిక్క కండరాల గాయంతో బాధపడుతున్న పతీరానా సీజన్లో కేకేఆర్ ఆడిన 12 మ్యాచ్లకు దూరంగా ఉన్నాడు.
గాయం నుంచి కోలుకున్న పతీరానా గుజరాత్ టైటాన్స్తో జరిగిన గత మ్యాచ్లో ఇంపాక్ట్ ప్లేయర్గా బరిలోకి దిగాడు. వచ్చీ రావడంతోనే తన ప్రతాపం చూపిస్తాడని అంతా భావించారు. కానీ విధి వింత నాటకం ఆడింది. గుజరాత్తో మ్యాచ్లో 8 బంతులు వేసిన అనంతరం పతీరానాకు కాలి పిక్క కండరాలు పట్టేయడంతో పెవిలియన్ చేరాడు.
తాజాగా గాయం తీవ్రత ఎక్కువగా ఉండడంతో పతీరానా కేకేఆర్ జట్టును వీడి స్వదేశానికి వెళ్లిపోయినట్లు ఆ జట్టు ఫ్రాంచైజీ ఆదివారం తెలిపింది. ఇవాళ కేకేఆర్ ఢిల్లీ క్యాపిటల్స్తో కీలక మ్యాచ్ ఆడాల్సి ఉంది. ఈ నేపథ్యంలో పతీరానా స్థానంలో లవ్నిత్ సిసోడియాతో భర్తీ చేయనున్నట్లు కేకేఆర్ తెలిపింది.
ఈ సీజన్లో తన బౌలింగ్తో కేకేఆర్కు ఎక్స్-ఫ్యాక్టర్గా మారతాడని భావించిన కేకేఆర్కు నిరాశే మిగిలింది. పైగా ఐపీఎల్ నిబంధనల ప్రకారం ఒక్క మ్యాచ్ ఆడినా ఆటగాడికి మొత్తం పారితోషికం చెల్లించాల్సిందే. ఈ లెక్కన పతీరానా సీజన్లో ఒక్క మ్యాచ్లోనే ఆడినప్పటికీ అతనికి రూ. 18 కోట్లు దక్కనున్నాయి.
దీంతో కేకేఆర్ అభిమానులు పతీరానాపై సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. 'పతీరానా ఒక మోసగాడు.. కోలుకున్నానని అబద్ధం చెప్పి సర్టిఫికేట్ చూపించాడు.. కేకేఆర్ తరఫున ఈ సీజన్లో ఒక మ్యాచ్ మాత్రమే ఆడిన పతీరానా డబ్బు మూటతో లంకకు వెళ్లిపోయాడు.. ఏం లాభం వచ్చాడు.. 18 కోట్లు పట్టుకెళ్లాడు.' అంటూ కామెంట్లు చేశారు.


