టీమిండియాకు ఆర్చర్‌ చుర‌క‌లు.. ‘వైభ‌వ్‌కు ఇదే నా స‌వాల్‌’ | Jofra Archer Shames IPL-Open Challenge-To-Vaibhav Sooryavanshi | Sakshi
Sakshi News home page

టీమిండియాకు ఆర్చర్‌ చుర‌క‌లు.. ‘వైభ‌వ్‌కు ఇదే నా స‌వాల్‌’

Jul 8 2026 4:02 PM | Updated on Jul 8 2026 4:30 PM

Jofra Archer Shames IPL-Open Challenge-To-Vaibhav Sooryavanshi

ఇంగ్లండ్ గ‌డ్డ‌పై తేలిపోతున్న టీమిండియాకు స్టార్ బౌల‌ర్ జోఫ్రా ఆర్చ‌ర్ చుర‌క‌లు అంటించాడు. ఇంగ్లండ్ గ‌డ్డ‌పై ఆడ‌డమంటే ఐపీఎల్‌లో ఆడినంత తేలిక కాద‌ని, ఇక్క‌డి పిచ్‌లు బౌలర్ల‌కు అనుకూలంగా ఉంటాయ‌ని, గుడ్‌లెంగ్త్‌తో బంతులు విసిరితేనే ప్రయోజ‌నం ఉంటుంద‌ని పేర్కొన్నాడు. టీమిండియాకు చుర‌క‌లు అంటించ‌డంతో పాటు వైభ‌వ్ సూర్య‌వంశీకి కూడా ఓపెన్ చాలెంజ్ విసిర‌డం ఆస‌క్తిగా మారింది. 

మూడో టీ20లో ఇంగ్లండ్ విజ‌యంలో కీల‌క‌పాత్ర పోషించి ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచిన‌ ఆర్చ‌ర్ మాట్లాడుతూ.. ‘ఇంగ్లండ్ గ‌డ్డ‌పై ప‌రిస్థితులు వేరుగా ఉంటాయి. ఐపీఎల్‌లో బౌల‌ర్ల‌కు క‌ఠినంగా ఉంటుంది. బ్యాట‌ర్ల‌కు అనుకూలంగా అక్క‌డి మైదానాల్లోని బౌండ‌రీల‌ను త‌క్కువ దూరంలోనే ఉంటాయి. 

కానీ ఇంగ్లండ్‌లో ప‌రిస్థితులు అలా ఉండ‌వు. గుడ్ లైన్ అండ్ లెంగ్త్‌తో బంతులు విసిరితేనే ఇక్క‌డ వికెట్లు ల‌భిస్తాయి. ఇక్క‌డి మైదానాల్లో బౌండ‌రీల దూరం త‌క్కువ ఉన్న‌ప్ప‌టికీ బంతి వికెట్ల మీద‌కు వ‌స్తుంది కాబ‌ట్టే ఆడ‌డం కాస్త క‌ష్ట‌త‌రంగా ఉంటుంది.  ఐపీఎల్‌లో 200 స్కోరు చేసినా కూడా ఓడిన సంద‌ర్భాలే ఎక్కువ‌గా ఉంటాయి. కానీ ఇంగ్లీష్ పిచ్‌ల‌పై 200 స్కోరు అంటే ఆషామాషీ కాదు. జాగ్ర‌త్తగా ఆడ‌క‌పోతే ఇలాంటి ప‌రిణామాలే ఎదురవుతాయి.’ అని చెప్పుకొచ్చాడు. 

అయితే వైభ‌వ్ ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఆర్చ‌ర్ బౌలింగ్‌లో సిక్స‌ర్లు కొట్ట‌డంపై ఆర్చ‌ర్‌ను ప్ర‌శ్నించ‌గా.. ‘రాబోయే మ్యాచ్‌ల్లో అత‌డిని ఎదుర్కొనే స‌మ‌యంలో స్ప‌ష్ట‌మైన ప్ర‌ణాళిక వేసుకున్నా. వైభ‌వ్‌కు ఇదే నా స‌వాల్ (న‌వ్వుతూ)* అని ఆర్చ‌ర్ తెలిపాడు. మ్యాచ్ విష‌యానికొస్తే.. మంగ‌ళ‌వారం జ‌రిగిన మూడో టీ20 మ్యాచ్‌లో ఇంగ్లండ్ 125 ప‌రుగుల తేడాతో టీమిండియాపై భారీ విజ‌యాన్ని సాధించింది. 

202 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన టీమిండియా ఇంగ్లండ్ బౌల‌ర్ల ధాటికి పూర్తి ఓవ‌ర్లు ఆడ‌కుండానే 11.4 ఓవ‌ర్ల‌లో 76 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది. ఆర్చ‌ర్ 29 ప‌రుగులిచ్చి మూడు వికెట్లు తీయగా, జోష్ టంగ్ 28 ప‌రుగులిచ్చి 4 వికెట్లు ప‌డ‌గొట్టాడు. అంత‌క‌ముందు ఇంగ్లండ్ 20 ఓవ‌ర్ల‌లో 7 వికెట్ల న‌ష్టానికి 201 ప‌రుగులు చేసింది. ఫిల్ సాల్ట్ (70), సామ్ క‌ర‌న్ (44 నాటౌట్‌) రాణించారు. ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో ఇంగ్లండ్ 2-0తో ఆధిక్యంలో నిలిచింది. ఇరుజ‌ట్ల మ‌ధ్య నాలుగో టీ20 గురువారం రాత్రి 10 గంట‌ల‌కు బ్రిస్ట‌ల్ వేదిక‌గా జ‌ర‌గ‌నుంది.

Read: IND vs ENG: సూర్యకుమార్‌ గుర్తొస్తున్నాడు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement