Khelo India Youth Games: బంగారు కొండ.. టైలర్‌ కలను నెరవేర్చిన కొడుకు

Khelo India: Adil Altaf Tailor Son Win Jammu And Kashmir 1st Cycling Gold - Sakshi

ఖేలో ఇండియా యూత్‌ గేమ్స్‌లో 18 ఏళ్ల కశ్మీర్‌ కుర్రాడు ఆదిల్‌ అల్తాఫ్‌ అదరగొట్టాడు. జమ్మూ కశ్మీర్‌ తరపున ఖేలో ఇండియా యూత్‌ గేమ్స్‌ళో సైక్లింగ్‌ విభాగంలో తొలి స్వర్ణం సాధించిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. శనివారం ఉదయం నిర్వహించిన 70 కిమీ సైక్లింగ్‌ రోడ్‌ రేసులో ఆదిల్‌ అల్తాఫ్‌ అందరి కంటే ముందుగా గమ్యాన్ని చేరి పసిడి అందుకున్నాడు. అంతకముందు ఒక్కరోజు ముందు 28 కిమీ విభాగంలో నిర్వహించిన రేసులో రజతం సాధించి అందరి దృష్టిని ఆకర్షించాడు.

ఒక టైలర్‌ కొడుకు తమ రాష్ట్రానికి స్వర్ణం పతకం తీసుకురావడంతో జమ్మూ కశ్మీర్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌  మనోజ్‌ సింహా ఆదిల్‌ అల్తాఫ్‌ను ప్రత్యేకంగా అభినందించాడు.''ఈ విజయం నాకు చాలా పెద్దది. పతకం సాధిస్తాననే నమ్మకంతో ఖేలో ఇండియాకు వచ్చా. అయితే స్వర్ణ పతకం రావడం నా నమ్మకానికి మరింత బూస్టప్‌ ఇచ్చినట్లయింది'' అంటూ ఆదిల్‌ అల్తాఫ్‌ పేర్కొన్నాడు.

15 ఏళ్ల వయసులో ఆదిల్‌ అల్తాప్‌ కశ్మీర్‌ హార్వర్డ్‌ స్కూల్లో జరిగిన సైక్లింగ్‌ ఈవెంట్‌లో తొలిసారి పాల్గొన్నాడు. ఆ రేసులో విజేతగా నిలిచిన ఆదిల్‌ అల్తాఫ్‌ అక్కడి నుంచి సైక్లింగ్‌ను మరింత సీరియస్‌గా తీసుకున్నాడు. కొడుకు ఉత్సాహం, సైక్లింగ్‌పై ఉన్న ఇష్టం చూసి.. పగలు రాత్రి తేడా తెలియకుండా టైలరింగ్‌ చేసి పైసా పైసా కూడబెట్టి ఆదిల్‌కు రేసింగ్‌ సైకిల్‌ను గిఫ్ట్‌గా ఇచ్చాడు.ఆ తర్వాత లోకల్‌లో నిర్వహించిన పలు ఈవెంట్స్‌ ఆకట్టుకునే ప్రదర్శన కనబరిచాడు. ఆదిల్‌ అల్తాఫ్‌ ప్రదర్శనకు మెచ్చిన శ్రీనగర్‌లోని ఎస్‌బీఐ బ్యాంక్‌ రూ.4.5 లక్షల ఎంటిబీ బైక్‌ను గిప్ట్‌గా ఇవ్వడం విశేషం. ఇక ఖేలో ఇండియా యూత్‌ గేమ్స్‌లో పతకం సాధించాలనే కాంక్షతో ఆదిల్‌ అల్తాప్‌ గత ఆరు నెలలుగా  పాటియాలాలోని ఎన్‌ఐఎస్‌లో శిక్షణ తీసుకున్నాడు. తాజాగా స్వర్ణం సాధించడంతో ఆదిల్‌ అల్తాఫ్‌  తన కలను నెరవేర్చుకున్నాడు.

చదవండి: కామన్వెల్త్‌ క్రీడలకు నిఖత్‌ జరీన్‌

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top