ఫైనల్లో సాకేత్‌ జోడీ | Karnataka Open ATP Challenger Saketh Myneni Niki Poonacha into Doubles Final | Sakshi
Sakshi News home page

ఫైనల్లో సాకేత్‌ జోడీ

May 16 2026 1:39 AM | Updated on May 16 2026 1:39 AM

Karnataka Open ATP Challenger Saketh Myneni Niki Poonacha into Doubles Final

బెంగళూరు: కర్ణాటక ఓపెన్‌ ఏటీపీ చాలెంజర్‌-50 టెన్నిస్‌ టోర్నీ పురుషుల డబుల్స్‌ విభాగంలో భారత డేవిస్‌కప్‌ జట్టు మాజీ సభ్యుడు, ఆంధ్రప్రదేశ్‌ ప్లేయర్‌ సాకేత్‌ మైనేని ఫైనల్లోకి ప్రవేశించాడు. శుక్రవారం జరిగిన సెమీఫైనల్లో సాకేత్‌-నికీ కలియంద పునాచా (భారత్‌) జోడీ 7-5, 6-1తో టాప్‌ సీడ్‌ ప్రజ్వల్‌ దేవ్‌-నితిన్‌ కుమార్‌ సిన్హా (భారత్‌) జంటపై విజయం సాధించింది.

71 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సాకేత్‌-పునాచా మూడు ఏస్‌లు సంధించి, ఒక డబుల్‌ ఫాల్ట్‌ చేశారు. తొలి సర్వీస్‌లో 27 పాయింట్లు, రెండో సర్వీస్‌లో 12 పాయింట్లు స్కోరు చేశారు. తమ సర్వీస్‌ను ఒకసారి కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్‌ను నాలుగుసార్లు బ్రేక్‌​ చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో డిప్యూటీ కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న సాకేత్‌ ఈ ఏడాది తొమ్మిది టోర్నీల్లో పాల్గొన్నా క్వార్టర్‌ ఫైనల్‌ దాటి ముందుకెళ్లలేకపోయాడు.

పదో టోర్నీలో మాత్రం టైటిల్‌కు విజయం దూరంలో నిలిచాడు. నేడు జరిగే ఫైనల్లో పీటర్‌ బార్‌ బిరుకోవ్‌ (రష్యా)-గ్రిగోరి లొమాకిన్‌ (కజకిస్తాన్‌)లతో సాకేత్‌-పునాచా తలపడతారు. రెండో సెమీఫైనల్లో బిరుకోవ్‌-లొమాకిన్‌ 7-6 (7/4), 7-6 (7/4)తో ఆదిల్‌ కల్యాణ్‌పూర్‌-ముకుంద్‌ శశికుమార్‌ (భారత్‌)లపై విజయం సాధించారు.

Advertisement
 
Advertisement
Advertisement