ఐపీఎల్-2026 సీజన్లో ప్లే ఆఫ్స్ బెర్త్ కోసం ప్రయత్నిస్తున్న చెన్నై సూపర్ కింగ్స్కు లక్నో సూపర్ జెయింట్స్ షాకిచ్చింది. శుక్రవారం ఏకానా స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్లో సీఎస్కేపై 7 వికెట్ల తేడాతో లక్నో ఘన విజయం సాధించింది. చెన్నై విధించిన 188 పరుగుల భారీ లక్ష్యాన్ని సూపర్ జెయింట్స్ కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి 16.4 ఓవర్లలో చేధించింది.
లక్ష్య చేధనలో లక్నో ఓపెనర్ మిచెల్ మార్ష్ విధ్వంసం సృష్టించాడు. తన తుపాన్ బ్యాటింగ్తో సీఎస్కే బౌలర్లకు చుక్కలు చూపించాడు. మార్ష్ కేవలం 38 బంతుల్లో 9 ఫోర్లు, 7 సిక్స్లతో 90 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈజీగా సెంచరీ మార్క్ అందుకునేలా కన్పించిన మార్ష్.. దురదృష్టశాత్తూ రనౌటయ్యాడు. అతడితో పాటు జోష్ ఇంగ్లిష్(36), పూరన్(32 నాటౌట్) రాణించాడు. సీఎస్కే బౌలర్లలో ముఖేష్ చౌదరి, జాన్సన్ తలా ఓ వికెట్ సాధించాడు.
అంతకముందు బ్యాటింగ్ చేసిన సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. రుతురాజ్ గైక్వాడ్(13), సంజూ శాంసన్(20) ఆరంభంలోనే ఔటైనప్పటికి.. యువ ఆటగాడు కార్తీక్ శర్మ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. కార్తీక్ శర్మ 42 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్స్లతో 71 పరుగులు చేశాడు. అతడితో పాటు శివమ్ దూబే(32) ఆఖరిలో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు.
లక్నో బౌలర్లలో ఆకాశ్ సింగ్ మూడు వికెట్లు పడగొట్టగా.. షాబాజ్, మహ్మద్ షమీ తలా వికెట్ సాధించారు. కాగా సీఎస్కే ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే తదుపరి రెండు మ్యాచ్లో భారీ విజయం సాధించాలి. అంతేకాకుండా మిగిలిన జట్లు ఫలితాలపై ఆధారపడాల్సింటుంది.


