ఐపీఎల్ 2026లో భాగంగా నిన్న (ఏప్రిల్ 18) రాత్రి జరిగిన మ్యాచ్లో సీఎస్కేపై సన్రైజర్స్ 10 పరుగుల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ గెలుపు అనంతరం మైదానంలోని స్టాండ్స్లో ఓ ఆసక్తికర సన్నివేశం తారసపడింది. సన్రైజర్స్ యజమాని కావ్యా మారన్ తనదైన శైలిలో సంబురాలు చేసుకుంటూ కనిపించింది.
భావోద్వేగాలను ఎప్పుడూ నియంత్రణలో ఉంచుకోలేని కావ్యా, సన్రైజర్స్ గెలవగానే చిన్నపిల్లలా ఎగిరిగంతులేసింది. ఈ క్రమంలో అప్పటికే అల్లరి చేస్తున్న సీఎస్కే అభిమానుల నోళ్లు మూయించింది. నోటిపై వేలు పెట్టి సైలెన్స్ అంటూ విరాట్ కోహ్లి స్టయిల్లో గెస్టర్ ఇచ్చింది.
Kavya Maran doing Silence gesture🤫🔥🔥🔥 pic.twitter.com/C5FDifkPej
— Eagle_Riser 🦅 (@UnpairedElect17) April 18, 2026
విరాట్ కూడా అభిమానులు ఎక్కువ హడావుడి చేస్తే నోటిపై వేలు పెట్టి సైలెన్స్ అంటూ గెశ్చర్స్ ఇస్తాడు. కావ్యా సీఎస్కే అభిమానుల నోళ్లు మూయించిన వీడియోలు సోషల్మీడియాలో వైరలవుతున్నాయి. వీటిని చూసి తమిళ ప్రజలు కావ్యా మారన్పై మండిపడుతున్నారు. తమిళురాలై ఉండి, తమిళ అభిమానుల నోళ్లు మూయించడమేంటని ఫైరవుతున్నారు.
కాగా, నిన్నటి మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సన్రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ (59), క్లాసెన్ (59) అర్ద సెంచరీలతో రాణించారు. సీఎస్కే బౌలర్లలో అన్షుల్ కంబోజ్ (3-0-22-3), జేమీ ఓవర్టన్ (4-0-37-3), ముకేశ్ చౌదరి (2-0-21-2), గుర్జప్నీత్ సింగ్ (4-0-34-1) అద్భుతంగా బౌలింగ్ చేశారు.
అనంతరం బరిలోకి దిగిన సీఎస్కే ఓ దశ వరకు సునాయాసంగా గెలిచేలా కనిపించినా, చివరికి అనూహ్యంగా ఓటమిపాలైంది. ఎస్ఆర్హెచ్ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేసి సీఎస్కే గెలుపును అడ్డుకున్నారు. ముఖ్యంగా ఎషాన్ మలింగ (4-0-29-3), నితీశ్ కుమార్ రెడ్డి (4-0-31-2) సీఎస్కేకు అడ్డుకట్ట వేశారు. సాకిబ్ హుస్సేన్ (4-0-32-1), శివాంగ్ కుమార్ (3-0-18-1) కూడా పర్వాలేదనిపించారు.
వీరి ధాటికి సీఎస్కే 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 184 పరుగులు మాత్రమే చేయగలిగింది. సీఎస్కే ఇన్నింగ్స్లో ఒక్కరు కూడా చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేకపోయారు. 34 పరుగులు చేసిన మాథ్యూ ఫార్ట్ ఆ జట్టులో టాప్ స్కోరర్. ఈ మ్యాచ్లో గెలుపుతో సన్రైజర్స్ పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి ఎగబాకింది.


