Jasprit Bumrah: 'సంధికాలం నడుస్తోంది.. మార్చాల్సిన సమయం వచ్చేసింది!'

IPL 2022: Jasprit Bumrah Intresting Comments About Mumbai Indians Slump - Sakshi

ఐపీఎల్‌ 2022లో ముంబై ఇండియన్స్‌ ఘోర ప్రదర్శనపై ఆ జట్టు వైస్‌ కెప్టెన్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ సీజన్‌లో ముంబై ఇంతవరకు బోణీ కొట్టలేదు. ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ పరాజయాలు చవిచూసి పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో ఉంది. ఐదుసార్లు చాంపియన్స్‌గా నిలిచిన జట్టు నుంచి ఇలాంటి ప్రదర్శన రావడమేంటని అభిమానులు గరం అవుతున్నారు. బ్యాటింగ్‌ పరంగా ఎలాంటి ఇబ్బంది లేనప్పటికి.. బౌలింగ్‌లో మాత్రం లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.. బుమ్రాకు సరైన మద్దతు లభించడం లేదు.. అందుకే ముంబై ఓటములు చవిచూస్తుందంటూ అభిప్రాయపడ్డారు.

తాజాగా అభిమానుల వ్యాఖ్యలపై బుమ్రా స్పందించాడు. ''క్రికెట్‌లో పరివర్తన దశ(గడ్డుకాలం) అనేది సహజం. ప్రతీ జట్టు ఏదో ఒక సందర్భంలో ఆ దారిలో వెళ్లాల్సిందే. ప్రస్తుతం మేము అదే స్థితిలో ఉన్నాం.జట్టులోకి కొత్త క్రికెటర్లు వచ్చారు.. పరిస్థితిని అర్థం చేసుకోవడానికి టైం తీసుకున్నారు. దానిని మార్చాల్సిన సమయం ఆసన్నమైంది. ఒత్తిడిలో ఉంటేనే పాఠాలు నేర్చుకుంటాం. వరుస ఓటములు కుంగదీసినప్పటికి.. వాటి ద్వారా వచ్చిన అనుభవాలను పాఠాల రూపంలో నేర్చుకున్నాం. రాబోయే మ్యాచ్‌ల నుంచి మా గేమ్‌ప్లాన్‌ మారనుంది. ఇలాంటి పరిస్థితులు గతంలోనూ ఎదురయ్యాయి. ఐదుసార్లు చాంపియన్స్‌ అన్న సంగతి మరిచిపోకండి.. కచ్చితంగా నిలదొక్కకుంటాం'' అంటూ ధీమా వ్యక్తం చేశాడు.

చదవండి: IPL 2022: అక్షర్‌ పటేల్‌ .. పేరు వెనుక ఇంత పెద్ద కథ దాగుందా!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top