IPL 2022, RR vs RCB: 'I am Not Done Yet' Dinesh Karthik Says After Won The Match - Sakshi
Sakshi News home page

IPL 2022: ‘అత్యుత్తమ ఫినిషర్‌’.. కెరీర్‌ ముగిసిపోలేదని నాకు నేనే చెప్పుకొన్నా! ఇప్పుడిలా..

Published Wed, Apr 6 2022 8:39 AM

IPL 2022: Dinesh Karthik Says Was Telling Himself I am Not Done Yet - Sakshi

IPL 2022 RR Vs RCB- Dinesh Karthik Comments: కీలక సమయంలో 23 బంతుల్లో 7 ఫోర్లు, ఒక సిక్సర్‌ సాయంతో 44 పరుగులు.. అద్భుత ఇన్నింగ్స్‌తో ఆఖరి వరకు అజేయంగా నిలిచి తమ జట్టును విజయతీరాలకు చేర్చాడు రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు ఆటగాడు దినేశ్‌ కార్తిక్‌. జట్టు కష్టాల్లో కూరుకుపోయిన వేళ షాబాజ్‌ అహ్మద్‌(45 పరుగులు)తో కలిసి ఇన్నింగ్స్‌ చక్కదిద్ది.. సంచలన విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. తద్వారా డీకే ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు.

గతంలో కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు ప్రాతినిథ్యం వహించిన దినేశ్‌ కార్తిక్‌న ఐపీఎల్‌ మెగా వేలం బరిలోకి రాగా.. ఆర్సీబీ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఈ టీమిండియా వెటరన్‌ ఆటగాడి కోసం రూ. 5 కోట్ల 50 లక్షలు ఖర్చు చేసింది. ఇందుకు తగినట్లుగా అద్భుత ప్రదర్శనతో దినేశ్‌ కార్తిక్‌ అభిమానులను ఆకట్టుకుంటున్నాడు. ఇప్పటి వరకు ఈ సీజన్‌లో ఆడిన మూడు మ్యాచ్‌లలో పంజాబ్‌పై 32(నాటౌట్‌), కేకేఆర్‌పై 14 (నాటౌట్‌).. తాజాగా రాజస్తాన్‌పై 44 (నాటౌట్‌) పరుగులు సాధించాడు. 

ఈ క్రమంలో ముఖ్యంగా మంగళవారం నాటి ఇన్నింగ్స్‌తో డీకేపై ప్రశంసల వర్షం కురుస్తోంది. అత్యుత్తమ ఫినిషర్‌ అంటూ అతడు కితాబులు అందుకుంటున్నాడు. 36 ఏళ్ల వయసులో ఏమాత్రం ఆడగలడు అని సందేహాలు వ్యక్తం చేసిన వారికి బ్యాట్‌తోనే సమాధానం ఇస్తు​న్నాడు. ఈ నేపథ్యంలో ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు అందుకున్న దినేశ్‌ కార్తిక్‌ మాట్లాడుతూ... క్రికెటర్‌గా తన కెరీర్‌ ఇంకా ముగిసిపోలేదని వ్యాఖ్యానించాడు. ఇప్పటి వరకు తన క్రికెట్‌ ప్రయాణంలో తోడుగా నిలిచిన వారి పట్ల కృతజ్ఞతా భావం చాటుకున్నాడు.

‘‘గతేడాది ఇంకాస్త మెరుగ్గా ఆడి ఉంటే బాగుండేది అనిపించింది. అందుకే ఈసారి ఎలాగైనా రాణించాలని ప్రణాళికలు సిద్ధం చేసుకున్నా. నెట్స్‌లో కష్టపడ్డాను. నాకు శిక్షణ ఇచ్చిన వ్యక్తికే ఈ క్రెడిట్‌ మొత్తం దక్కుతుంది. నిజానికి ప్రతిసారి.. నాకు నేనే.. ‘‘నీ పని అయిపోలేదు’’ అని చెప్పుకొంటూ.. నేను ఇంకా క్రికెట్‌ ఆడగలననే నమ్మకాన్ని పెంపొందించుకున్నాను. నా పని నేను చేసుకుంటూనే విమర్శలకు సమాధానం చెప్పాలనకున్నా.

నా ప్రయాణం ఇక్కడి వరకు చేరడంలో చాలా మంది పాత్ర ఉంది. టీ20 క్రికెట్‌లో అనూహ్య పరిణామాలు ఉంటాయి. ముందుగా ప్లాన్‌ చేసినట్లుగానే కాకుండా అప్పటికప్పుడు టార్గెట్‌కు అనుగుణంగా మనల్ని మనం సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది’’ అని దినేశ్‌ కార్తిక్‌ చెప్పుకొచ్చాడు. కాగా రాజస్తాన్‌తో ముంబైలోని వాంఖడే మైదానంలో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ 4 వికెట్ల తేడాతో గెలుపొందింది.

చదవండి: Ravi Shastri: "అతడు యార్కర్ల కింగ్‌.. ప్రపంచకప్‌లో అతడి సేవలను కోల్పోయాం"

Advertisement

తప్పక చదవండి

Advertisement