మరోసారి కేఎల్‌ రాహుల్‌ విధ్వంసం ఖాయం: పంజాబ్‌ కోచ్‌

IPL 2021: This Time We Will See An Aggressive KL Rahul Says Wasim Jaffer - Sakshi

ముంబై: గతేడాది ఐపీఎల్‌లో పరుగుల వరద(14 మ్యాచ్‌ల్లో సెంచరీ, 5 హాఫ్‌ సెంచరీల సాయంతో 670 పరుగులు) పారించి, ఆరెంజ్‌ క్యాప్‌ను సొంతం చేసుకున్న పంజాబ్‌ కింగ్స్‌ కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌.. ఈ ఐపీఎల్‌ సీజన్‌లో కూడా తన విశ్వరూపాన్ని ప్రదర్శిస్తాడని ఆ జట్టు బ్యాటింగ్‌ కోచ్‌ వసీమ్‌ జాఫర్‌ జోస్యం చెప్పాడు. అయితే గత సీజన్‌లో తన సామర్థ్యానికి భిన్నంగా 129.35 స్ట్రయిక్‌రేట్‌తో పరుగులు చేయడంతో విమర్శలపాలైన రాహుల్‌.. ఈ సీజన్‌లో దానిపై దృష్టిసారిస్తానని ప్రకటించిన సంగతి తెలిసిందే. గత సీజన్‌లో మాక్స్‌వెల్ ఫామ్‌లేమి, ఐదో నంబర్‌ తర్వాత విధ్వంసకర ఆటగాడు లేకపోవడం వంటి సమస్యలతో రాహుల్‌ కాస్త నెమ్మదిగా ఆడాల్సి వచ్చిందని, ఈ సీజన్‌లో అలాంటి సమస్యలేవీ లేకపోవడంతో రాహుల్‌ విధ్వంసం ఖాయమని జాఫర్‌ పేర్కొన్నాడు. 

ఆటగాళ్లు ఒడిదుడుకులు ఎదుర్కోవడం సాధారణమేనని, ఏ ఆటగాడికైనా ఇలా జరుగుతుందని జాఫర్‌ వివరించాడు. రాహుల్‌ మూడు ఫార్మాట్లలో మంచి స్ట్రయిక్‌రేట్‌తో శతకాలు సాధించిన విషయాన్ని ఆయన గుర్తుచేశాడు. ఇంగ్లాండ్‌తో టీ20ల్లో విఫలమైనా వన్డేల్లో దూకుడుగా ఆడాడని, అది పంజాబ్‌ కింగ్స్‌కు శుభసూచకమని పేర్కొన్నాడు. ఇదిలా ఉండగా ఏప్రిల్‌ 9 నుంచి ప్రారంభంకానున్న క్యాష్‌ రిచ్‌ లీగ్‌ ప్రారంభ మ్యాచ్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ముంబై ఇండియన్స్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుతో తలపడనుంది. ముంబై వేదికగా ఏప్రిల్‌ 12న రాజస్థాన్‌ రాయల్స్‌, పంజాబ్‌ కింగ్స్‌ జట్లు ఢీకొంటాయి.
చదవండి: ఆర్‌సీబీ ప్లేయర్‌ విధ్వంసం..

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top