
ఇంగ్లండ్ తాజా మాజీ సారధి ఇయాన్ మోర్గాన్ కెప్టెన్సీకి రిటైర్మెంట్ ప్రకటించిన నిమిషాల వ్యవధిలోనే ఓ ఆసక్తికర ప్రకటన చేశాడు. జూన్ 28న ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల సారధ్య బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు అధికారిక ప్రకటన చేసిన మోర్గాన్.. కొద్ది నిమిషాల్లోనే తన ఫ్యూచర్ ప్లాన్ను వెల్లడించాడు. ఇండియాతో పరిమిత ఓవర్ల సిరీస్ నుంచి కామెంటేటర్గా మారబోతున్నట్లు ప్రకటించాడు.
ఈ విషయాన్ని మోర్గాన్తో ఒప్పందం కుదుర్చుకున్న ‘స్కై’ నెట్వర్క్ ధృవీకరించింది. మోర్గాన్ తమ కామెంటరీ టీమ్లో చేరబోతున్నడని ప్రకటన విడుదల చేసింది. స్వదేశంలో ఇంగ్లండ్ ఆడబోయే తదుపరి సిరీస్ల నుంచి మోర్గాన్ స్కై నెట్వర్క్లో భాగస్వామిగా ఉంటాడని పేర్కొంది. మొత్తానికి ఇంగ్లండ్ తరఫున క్రికెటర్గా 13 ఏళ్ల కెరీర్కు ఫుల్స్టాప్ పెట్టిన నిమిషాల వ్యవధిలోనే మోర్గాన్ మరో పనిని వెతుక్కున్నాడు.
త్వరలో జరుగబోయే ఇండియా, సౌతాఫ్రికా సిరీస్ల నుంచి మోర్గాన్ కామెంటేటర్గా తన కెరీర్ మొదలుపెట్టనున్నాడు. ఐర్లాండ్ తరఫున కెరీర్ ప్రారంభించి ఇంగ్లండ్ క్రికెట్కు ఎనలేని సేవలనందించిన మోర్గాన్.. తన హయాంలో ఇంగ్లండ్కు వన్డే ప్రపంచకప్ (2019) అందించాడు. ఏడేళ్ల పాటు ఇంగ్లండ్ కెప్టెన్గా సేవలందించిన మోర్గాన్.. కెరీర్ మొత్తంలో (ఐర్లాండ్తో కలుపుకుని) 16 టెస్ట్లు, 248 వన్డేలు, 115 టీ20లు ఆడాడు. టెస్ట్ల్లో 2 శతకాలు, 3 అర్ధశతకాల సాయంతో 700 పరుగులు, వన్డేల్లో 14 సెంచరీలు, హాఫ్ సెంచరీల సాయంతో 7701 పరుగులు, టీ20ల్లో 14 హాఫ్ సెంచరీల సాయంతో 2458 పరుగులు చేశాడు.
చదవండి: Ind Vs Eng: ఇంగ్లండ్తో టెస్టుకు కెప్టెన్ బుమ్రా! బౌలర్లకు మెదడు తక్కువా?