
లార్డ్స్ టెస్ట్లో టీమిండియా స్వల్ప లక్ష్య ఛేదనలో తడబాటుకు లోనైనప్పటికీ.. కెప్టెన్ శుభ్మన్ గిల్ మాత్రం ఓ భారీ రికార్డును సొంతం చేసుకున్నాడు. ఈ మ్యాచ్లో గిల్ ఘోరంగా విఫలమైనప్పటికీ (16, 6) రికార్డును చేజిక్కించుకోవడం విశేషం.
ఇంతకీ ఆ రికార్డు ఏంటంటే.. రెండో ఇన్నింగ్స్లో 6 పరుగులకు ఔటైన గిల్.. ఇంగ్లండ్లో ఓ టెస్ట్ సిరీస్లో అత్యధిక పరుగులు సాధించిన భారత ఆటగాడిగా అవతరించాడు. ఈ క్రమంలో 23 ఏళ్ల కిందట రాహుల్ ద్రవిడ్ నెలకొల్పిన రికార్డును బద్దలు కొట్టాడు. ప్రస్తుత ఇంగ్లండ్ పర్యటనలో ఇప్పటివరకు ఆడిన 3 మ్యాచ్ల్లో గిల్ ఓ డబుల్ సెంచరీ (269), 2 సెంచరీల (147, 161) సాయంతో 101.17 సగటున 607 పరుగులు సాధించాడు.
ద్రవిడ్ 2002 ఇంగ్లండ్ పర్యటనలో 602 పరుగులు చేశాడు. ఇంగ్లండ్లో ఓ టెస్ట్ సిరీస్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా గిల్ అవతరించడంతో మరో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి మూడో స్థానానికి పడిపోయాడు. విరాట్ 2016 ఇంగ్లండ్ పర్యటనలో 593 పరుగులు చేశాడు.
ఇంగ్లండ్ గడ్డ పై ఓ టెస్ట్ సిరీస్లో అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాళ్లు (టాప్-5)..
శుభ్మన్ గిల్ – 607 పరుగులు (2025లో)
రాహుల్ ద్రవిడ్ – 602 పరుగులు (2002లో)
విరాట్ కోహ్లీ – 593 పరుగులు (2018లో)
సునీల్ గవాస్కర్ – 542 పరుగులు (1979లో)
రాహుల్ ద్రవిడ్ – 461 పరుగులు (2011లో)
మ్యాచ్ విషయానికొస్తే.. స్వల్ప లక్ష్య ఛేదనలో టీమిండియా తడపడుతుంది. 193 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన టీమిండియా నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్లు కోల్పోయి 58 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ మ్యాచ్లో గెలవాలంటే టీమిండియా ఇంకా 135 పరుగులు చేయాలి. కేఎల్ రాహుల్ (33) క్రీజ్లో ఉన్నాడు.
ఓవర్నైట్ బ్యాటర్గా బరిలోకి దిగిన ఆకాశ్దీప్ (1) ఔట్ కావడంతో నాలుగో రోజు ఆట ముగిసింది. భారత ఇన్నింగ్స్లో యశస్వి జైస్వాల్ 0, కరుణ్ నాయర్ 14, శుభ్మన్ గిల్ 6 పరుగులకు ఔటయ్యారు. ఇంగ్లండ్ బౌలర్లలో బ్రైడన్ కార్స్ 2, జోఫ్రా ఆర్చర్, బెన్ స్టోక్స్ తలో వికెట్ తీశారు.
అంతకుముందు ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్లో 192 పరుగులకే కుప్పకూలింది. వాషింగ్టన్ సుందర్ తన స్పిన్ మాయాజాలంతో ఇంగ్లండ్ బ్యాటర్ల భరతం పట్టాడు. కీలకమైన రూట్ (40), జేమీ స్మిత్ (8), బెన్ స్టోక్స్ (33) వికెట్లతో షోయబ్ బషీర్ (2) వికెట్ తీసి ఇంగ్లండ్ను చావుదెబ్బకొట్టాడు. మరో ఎండ్ నుంచి బుమ్రా కూడా ఇంగ్లండ్ ఆటగాళ్లపై అటాక్ చేశాడు. టీ విరామం తర్వాత బుమ్రా క్రిస్ వోక్స్ (10), బ్రైడన్ కార్స్లను (1) క్లీన్ బౌల్డ్ చేశాడు.
తొలి సెషన్లో సిరాజ్, నితీశ్ కుమార్, ఆకాశ్దీప్ చెలరేగిపోయారు. డకెట్ (12), ఓలీ పోప్ను (4) సిరాజ్ పెవిలియన్కు పంపగా.. జాక్ క్రాలేను (22) నితీశ్, హ్యారీ బ్రూక్ను (23) ఆకాశ్దీప్ ఔట్ చేశారు.
ఈ మ్యాచ్లో ఇరు జట్లు తొలి ఇన్నింగ్స్ల్లో ఒకే స్కోర్ (387) చేసిన విషయం తెలిసిందే. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ తరఫున రూట్ (104), జేమీ స్మిత్ (51), బ్రైడన్ కార్స్ (56) సత్తా చాటగా.. భారత్ తరఫున కేఎల్ రాహుల్ (100), పంత్ (74), జడేజా (72) రాణించారు.
బుమ్రా ఐదు వికెట్లతో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ పతనాన్ని శాశించగా.. సిరాజ్, నితీశ్ తలో 2, రవీంద్ర జడేజా ఓ వికెట్ పడగొట్టారు. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో క్రాలే 18, డకెట్ 23, ఓలీ పోప్ 44, హ్యారీ బ్రూక్ 11, బెన్ స్టోక్స్ 44, క్రిస్ వోక్స్ 0, జోఫ్రా ఆర్చర్ 4 పరుగులకు ఔటయ్యారు.
భారత తొలి ఇన్నింగ్స్లో యశస్వి జైస్వాల్ 13, కరుణ్ నాయర్ 40, శుభ్మన్ గిల్ 16, నితీశ్ రెడ్డి 30, వాషింగ్టన్ సుందర్ 23, ఆకాశ్దీప్ 7, బుమ్రా 0, సిరాజ్ 0 (నాటౌట్) పరుగులు చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో వోక్స్ 3, ఆర్చర్, స్టోక్స్ తలో 2, కార్స్, బషీర్ చెరో వికెట్ తీశారు.
కాగా, ఐదు మ్యాచ్ల ఈ సిరీస్లో ఇరు జట్లు తలో మ్యాచ్ గెలిచి 1-1తో సమంగా ఉన్న విషయం తెలిసిందే.