మధ్య ప్రాచ్యంలో ఇరాన్, ఇజ్రాయెల్- అమెరికా దేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరుకున్నాయి. ఇప్పుడు ఈ యుద్ద ప్రభావం ఊహించని విధంగా ఇంగ్లండ్ క్రికెట్ బోర్డుపై పడింది. మరో పది రోజుల్లో ప్రారంభం కానున్న ఇంగ్లండ్ కౌంటీ ఛాంపియన్షిప్ సీజన్కు 'డ్యూక్స్' (Dukes) బంతుల కొరత ఏర్పడింది.
ఇంగ్లండ్లో జరిగే కౌంటీ ఛాంపియన్షిప్, అంతర్జాతీయ టెస్టు సిరీస్లలో డ్యూక్స్ బంతులను మాత్రమే ఉపయోగిస్తారు. అయితే ఏప్రిల్ 3 నుంచి కౌంటీ సీజన్ ప్రారంభం కావాల్సి ఉండగా.. ఆయా క్లబ్ల వద్ద ఉండాల్సిన స్టాక్లో కేవలం 50 శాతం బంతులు మాత్రమే అందుబాటులో ఉన్నాయి.
ఈ డ్యూక్స్ బంతులు దక్షిణాసియా దేశాలనైన భారత్, పాకిస్తాన్లో తాయారు అవుతాయి. అయితే మధ్యప్రాచ్యంలో నెలకొన్న సంక్షోభం కారణంగా దక్షిణాసియాలో తయారైన బంతులు ఇంగ్లండ్కు చేరడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. దీంతో కౌంటీ జట్ల పరిమిత సంఖ్యలో మాత్రమే బంతులు ఉన్నాయి. అయితే ఈ సంక్షోభంపై తయారీదారు బ్రిటిష్ క్రికెట్ బాల్స్ లిమిటెడ్ సంస్థ యజమాని దిలీప్ జజోడియా స్పందించారు.
"ఈ గల్ఫ్ యుద్దం కారణంగా మేము పెద్ద సంక్షోభంలో చిక్కుకున్నాము. సీజన్ ప్రారంభంలో క్లబ్లకు 50 శాతం బంతులను మాత్రమే ఇచ్చి, మిగిలినవి తర్వాత అందజేయాల్సి వస్తోంది. ఉపఖండంలోని ఫ్యాక్టరీలలో బంతులు సిద్దంగా ఉన్నా.. రవాణా చేసేందుకు పరిస్థితులు అనుకూలంగా లేవు.
విమానయాన సంస్థలు సరుకు రవాణా చేయడానికి ముందుకు రావడం లేదు. రవాణా ఛార్జీలు కూడా భారీగా పెరిగాయి. సాధారణంగా 120 బంతుల బాక్స్కు కిలోకు 5 డాలర్లు ఛార్జ్ చేసేవారు. కానీ ఇప్పుడు కిలోకు 15 డాలర్లు అడుగుతున్నారు.
మధ్యప్రాచ్యం గుండా సరుకులు రవాణా చేయడం పెద్ద సమస్యగా మారింది" అని జజోడియా పేర్కొన్నాయి. ఒకవేళ సంక్షోభం మరింత ముదిరితే ప్రత్యామ్నాయంగా ఆస్ట్రేలియాకు చెందిన 'కూకబుర్రా' బంతులను వాడాల్సి రావచ్చు.
చదవండి: T20 WC: వరల్డ్ కప్లో జట్టు ఫెయిల్.. కెప్టెన్ సంచలన నిర్ణయం!


