రాజస్థాన్ రాయల్స్ ఆల్రౌండర్, శ్రీలంక టీ20 జట్టు కెప్టెన్ దసున్ షనకపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కఠిన చర్యలు తీసుకుంది. పాకిస్తాన్ సూపర్ లీగ్లోని లాహోర్ ఖలందర్స్ ఫ్రాంచైజీతో ఒప్పందాన్ని ఉల్లఘించినందుకు ఒక సంవత్సరం నిషేధం విధించింది. దీంతో షనక వచ్చే పీఎస్ఎల్ సీజన్ (2027)లో పాల్గొనలేరు.
పీసీబీ విడుదల చేసిన ప్రకటన ప్రకారం, లాహోర్ ఖలందర్స్తో చేసుకున్న ఒప్పందాన్ని షనక ఉల్లఘించాడు. మార్చి 21న టోర్నీ నుంచి తప్పుకున్నాడు. ఇందుకు అతను చూపించిన కారణాలు ఒప్పంద పరిధిలో చెల్లుబాటు కావు. కాబట్టి లీగ్ ప్రతిష్ఠను కాపాడేందుకు షనకపై ఏడాది నిషేధం విధించారు.
పీసీబీ తనపై విధించిన నిషేధాన్ని షనక పరోక్షంగా అంగీకరించాడు. ఓ ప్రకటన విడుదల చేస్తూ, తన విచారాన్ని వ్యక్తం చేశాడు. "హెచ్బీఎల్ పీఎస్ఎల్ నుంచి తప్పుకోవడం నా తప్పు. పాకిస్థాన్ అభిమానులు, లాహోర్ ఖలందర్స్ అభిమానులను నిరాశపరిచినందుకు క్షమాపణలు కోరుతున్నాను. ఆ సమయంలో మరో టోర్నమెంట్లో ఆడాలనే ఉద్దేశం నాకు లేదు. పాకిస్థాన్లో ఆడటం నాకు ఎప్పుడూ ఆనందమే" అని పేర్కొన్నాడు. భవిష్యత్తులో తిరిగి ఈ లీగ్లో పాల్గొనే అవకాశం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశాడు.
కాగా, షనక పీఎస్ఎల్ నుంచి తప్పుకున్న తర్వాత ఐపీఎల్ ఫ్రాంచైజీ అయిన రాజస్థాన్ రాయల్స్తో ఒప్పందం చేసుకున్నాడు. సామ్ కర్రన్ గాయం కారణంగా సీజన్ మొత్తానికి దూరం కావడంతో రాయల్స్ షనకను ప్రత్యామ్నాయ ఆటగాడిగా ఎంపిక చేసుకుంది. షనకకు రాయల్స్ బేస్ ధర రూ. 2 కోట్లకు సొంతం చేసుకుంది.ఈ సీజన్లో షనక రాయల్స్ తరఫున ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు.


