రేసులో నిలవాలంటే ‘పంజా’ విసరాలి | CSK Won The Toss Elected To Field First Against Punjab | Sakshi
Sakshi News home page

రేసులో నిలవాలంటే ‘పంజా’ విసరాలి

Nov 1 2020 3:06 PM | Updated on Nov 1 2020 3:13 PM

CSK Won The Toss Elected To Field First Against Punjab - Sakshi

అబుదాబి:  కింగ్స్‌ పంజాబ్‌తో మ్యాచ్‌లో  టాస్‌ గెలిచిన చెన్నై సూపర్‌ కింగ్స్‌ టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకుంది. టాస్‌ గెలిచిన సీఎస్‌కే కెప్టెన్‌ ఎంఎస్‌ ధోని.. ముందుగా పంజాబ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. ఈ సీజన్‌లో ఇరుజట్ల మధ్య జరిగిన తొలి అంచె మ్యాచ్‌లో సీఎస్‌కే 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఓవరాల్‌గా ఇరుజట్లు 22సార్లు ముఖాముఖి పోరులో తలపడితే అందులో సీఎస్‌కే 13సార్లు విజయం సాధించగా, పంజాబ్‌ 9సార్లు గెలుపొందింది. ఇక ఇప్పటికే సీఎస్‌కే ప్లేఆఫ్స్‌ రేసు నుంచి నిష్ర్కమించగా, కింగ్స్‌ పంజాబ్‌ ఇంకా రేసులోనే ఉంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తేనే కింగ్స్‌ పంజాబ్‌ తన ప్లేఆఫ్స్‌ ఆశల్ని సజీవంగా ఉంచుకుంటుంది. సీఎస్‌కేపై గెలిచినా మెరుగైన రన్‌రేట్‌తో గెలవాలి. ఇంకా మూడు ప్లేఆఫ్స్‌ స్థానాలు ఖరారు కావాల్సి ఉంది. అందులో నాల్గో స్థానం కోసం విపరీతమైన పోటీ ఉంది. దాంతో పంజాబ్‌ కనీసం నాల్గో స్థానంలో ఉండాలంటే ధోని సేనపై భారీ విజయం సాధించాలి. (‘అందుకే ధోనికి బిగ్‌ ఫ్యాన్‌ అయ్యా’)

ప్రస్తుతం కింగ్స్‌ పంజాబ్‌ ఆరు విజయాలు సాధించి 12 పాయింట్లతో కొనసాగుతోంది. ఇక్కడ రన్‌రేట్‌ -0.133గా ఉంది. అదే సమయంలో సన్‌రైజర్స్‌ కూడా 12 పాయింట్లతో రేసులోకి వచ్చేసింది. ఇక్కడ ఆరెంజ్‌ ఆర్మీ రన్‌రేట్‌ 0.555గా ఉంది. కింగ్స్‌  పంజాబ్‌ ఓ మంచి విజయాన్ని సాధిస్తేనే ప్లేఆఫ్స్‌ ఆశల్ని సజీవంగా ఉంచుకుంటుంది. నాల్గో స్థానం రేసులో సన్‌రైజర్స్‌, కింగ్స్‌ పంజాబ్‌, రాజస్తాన్‌ రాయల్స్‌ల మధ్య ఎక్కువ పోటీ ఉండవచ్చు. ఈ మ్యాచ్‌లో పంజాబ్‌ విజయం సాధించి, సన్‌రైజర్స్‌,  రాజస్తాన్‌లు తమ తదుపరి మ్యాచ్‌ల్లో(చివరి మ్యాచ్‌ల్లో) గెలిచిన పక్షంలో ప్లేఆఫ్స్‌ రేసు ఆసక్తికరంగా ఉంటుంది. అవన్నీ దృష్టిలో పెట్టుకునే కింగ్స్‌ పంజాబ్‌ ఆడాల్సి ఉంటుంది. మరొకవైపు ధోని అండ్‌ గ్యాంగ్‌ కూడా వరుస విజయాలతో టచ్‌లోకి రావడం పంజాబ్‌ను కలవరపరుస్తోంది. (‘శ్రేయస్‌ అయ్యర్‌ గ్యాంగ్‌కు ప్లేఆఫ్స్‌ చాన్స్‌ కష్టమే’)

గత ఐదు మ్యాచ్‌లకు గాను కింగ్స్‌ పంజాబ్‌ నాలుగు విజయాలు సాధించగా,  సీఎస్‌కే రెండు విజయాలే సాధించింది.  కింగ్స్‌ పంజాబ్‌ ఆడిన గత మ్యాచ్‌లో ఓటమి పాలైంది. రాజస్తాన్‌తో జరిగిన ఆ మ్యాచ్‌లో పంజాబ్‌ ఏడు వికెట్ల తేడాతో పరాజయం చవిచూసింది. దాంతో పంజాబ్‌ జైత్రయాత్రకు బ్రేక్‌ పడింది.  కాగా, ఇరుజట్లలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో  కేఎల్‌ రాహుల్‌(641-పంజాబ్‌), డుప్లెసిస్‌(401-సీఎస్‌కే), మయాంక్‌ అగర్వాల్‌(398- పంజాబ్‌), నికోలస్‌ పూరన్‌(351-పంజాబ్‌), అంబటి రాయుడు(329-సీఎస్‌కే)లు టాప్‌ ఫెర్ఫార్మెర్స్‌గా ఉన్నారు. ఇక బౌలింగ్‌ విభాగంలో అత్యధిక వికెట్లు సాధించిన జాబితాలో  మహ్మద్‌ షమీ(20-పంజాబ్‌), సామ్‌ కరాన్‌(13-సీఎస్‌కే), రవి బిష్నోయ్‌(12-పంజాబ్‌), దీపక్‌ చాహర్‌(12-సీఎస్‌కే), మురుగన్‌ అశ్విన్‌(10-పంజాబ్‌)లు వరుసగా ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement