స్టార్ బ్యాటర్ సంజూ శాంసన్ సీఎస్కే తరఫున తొలి సీజన్లోనే అదిరిపోయే రికార్డు సాధించాడు. ఈ సీజన్లో 13 మ్యాచ్ల్లో 477 పరుగులు చేసిన అతడు.. సీఎస్కే తరఫున ఓ సీజన్లో అత్యధిక పరుగులు చేసిన వికెట్కీపర్గా కొత్త రికార్డు నెలకొల్పాడు. గతంలో ఈ రికార్డు ఎంఎస్ ధోని పేరిట ఉండేది.
అతడు 2013 సీజన్లో 16 ఇన్నింగ్స్ల్లో 461 పరుగులు చేశాడు. తాజాగా సంజూ ఈ రికార్డును బద్దలు కొట్టాడు. లీగ్ దశలో మరో మ్యాచ్ ఆడాల్సి ఉండటంతో సంజూ 500 పరుగుల అరుదైన మైలురాయిని కూడా తాకే ఛాన్స్ ఉంది. ఇదే జరిగితే సీఎస్కే తరఫున ఒక సీజన్లో 500 పరుగులు చేసిన తొలి వికెట్కీపర్గా నిలుస్తాడు.
రికార్డు సాధించినా, మ్యాచ్ చేజారింది..!
నిన్న ఎస్ఆర్హెచ్తో జరిగిన మ్యాచ్లో సంజూ పై రికార్డును సాధించాడు. ఈ మ్యాచ్లో సంజూ మెరుపు ఇన్నింగ్స్తో (13 బంతుల్లో 27; 5 ఫోర్లు, సిక్స్) అలరించాడు. సిక్స్తో ఖాతా తెరిచిన అతడు.. వరుస బౌండరీలతో ఎస్ఆర్హెచ్ బౌలర్లపై దాడి చేశాడు. అయితే పాట్ కమిన్స్ బౌలింగ్లో ఔటై ఇన్నింగ్స్ను భారీ స్కోర్గా మలచ లేకలేకపోయాడు.
ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్కే 20 ఓవర్లలో 180/7 స్కోర్ చేసింది. బ్రెవిస్ (44), కార్తీక్ శర్మ (32), సంజూ శాంసన్ (27), శివమ్ దూబే (26) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. ఎస్ఆర్హెచ్ బౌలర్లలో పాట్ కమిన్స్ 3 వికెట్లతో ఆకట్టుకున్నాడు.
అనంతరం ఓ మోస్తరు లక్ష్య ఛేదనలో ఎస్ఆర్హెచ్ సైతం తడబడినా చివరికి గెలిచింది. ఇషాన్ కిషన్ (70), క్లాసెన్ (47) రాణించడంతో 19 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. ఈ గెలుపుతో ఎస్ఆర్హెచ్ ప్లే ఆఫ్స్ బెర్త్ను ఖరారు చేసుకోగా.. సీఎస్కే అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది.


