మా కుటుంబంలో మాయదారి వైరస్ : క్రికెటర్‌ భార్య ఆవేదన

Ashwin Wife Say 10 Family Memebers Testing Positive Same Week - Sakshi

కరోనా బారిన క్రికెటర్‌ అశ్విన్‌  కుటుంబం 

ఒకేసారి పదిమందికి పాజిటివ్‌

దేశంలో కరోనా కల్లోలం కొనసాగుతూనే ఉంది.  రోజువారి రికార్డు స్థాయి కేసులతో వైరస్‌ వ్యాప్తి  కొనసాగుతోంది.  తాజాగా భారత్‌ ఆఫ్‌ స్పిన్నర్‌, ఆల్‌ రౌండర్‌ అశ్విన్‌ కుటుంబంలో కరోనా మహమ్మారి కలకలం సృష్టించింది. ఏకంగా ఇంట్లో ఉన్న పది మందికి వైరస్‌ సోకింది. ఈ విషయాన్ని అశ్విన్‌ భార్య ప్రీతి నారాయణన్‌  సోషల్‌ మీడియా ద్వారా వెల్లడించారు. అశ్విన్‌ కుటుంబ సభ్యులు ఈ శుక్రవారం కోవిడ్‌ పరీక్షలు చేసుకోగా.. పాజిటివ్‌ గా నిర్ధారణ అయ్యిందని ప్రీతి ట్వీట్‌ చేశారు.  ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ తరఫున బరిలో ఉన్న అశ్విన్‌ గతవారం సీజన్‌ నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రీతి తమ అనుభవాలను  అటు ట్విటర్‌, ఇటు ఇన్‌స్టాలో షేర్‌ చేశారు. 

గతవారంమంతా  ఒక పీడకలలా గడిచింది
‘‘మా ఇంట్లో ఉన్న పది మందికి కరోనా వైరస్‌ సోకింది. అందులో 6గురు పెద్దలు, 4 పిల్లలు ఉన్నారు.  పిల్లల కారణంగా అందరికీ ఈ మహమ్మారి  వ్యాపించింది. ప్రస్తుతం కుటుంబంలోని అందరూ వేర్వేరు ఇళ్లలో, ఆసుపత్రుల్లో చేరడంతో గతవారం మా కుటుంబానికి ఓ పీడకలలా గడిచింది. 5-8 రోజులు చాలా కష్టంగా గడిచాయి.  సాయం చేయడానికి అందరూ ఉ‍న్నా.. చేయలేని పరిస్థితి. ఇదో మాయదారి వైరస్‌. మానసిక ఆరోగ్యం కంటే శారీరక ఆరోగ్యం ద్వారానే  వేగంగా  కోలుకోగలమని  భావిస్తున్నాను. దయచేసి  జాగ్రత్తగా ఉండండి. ప్రతీ ఒక్కరూ టీకా తీసుకోండి,  టీకాతోనే మనం ,మన కుటుంబ సభ్యులు ఈ మహమ్మారితో పోరాడగలం‘‘ అంటూ ప్రీతి ట్వీట్‌ చేశారు.

ఇదిలా ఉండగా.. ఢిల్లీ క్యాపిటల్స్‌ తరఫున ఆడుతున్న రవిచంద్రన్‌ అశ్విన్‌ ఈ ఐపీఎల్‌ సీజన్‌కు తాత్కాలిక విరామం ప్రకటిస్తున్నట్లు గత ఆదివారం ట్వీట్‌ చేసిన విషయం తెలిసిందే. ఈ ఐపీఎల్‌ 2021 సీజన్‌లో లీగ్‌ నుంచి తప్పుకున్న తొలి భారతీయ క్రికెటర్‌ అశ్విన్‌.  కరోనా సోకి కష్టకాలంలో ఉన్న తన కుటుంబ సభ్యులు మద్దతుగా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నాడు.

( చదవండి: తండ్రికి కరోనా పాజిటివ్‌.. ఐపీఎల్‌ వదిలి వెళ్లిన మాజీ ఆటగాడు )

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top