
కౌలాలంపూర్: ప్రపంచ స్క్వాష్ చాంపియన్షిప్ ఆసియా క్వాలిఫయింగ్ టోర్నమెంట్లో భారత రైజింగ్ స్టార్స్ అనాహత్ సింగ్, ఆకాంక్ష సాలుంఖే సెమీఫైనల్లోకి దూసుకెళ్లారు. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్లో ఐదో సీడ్, 17 ఏళ్ల అనాహత్ 11–1, 11–7, 11–5తో అకారి మిదోరికవా (జపాన్)పై, రెండో సీడ్ ఆకాంక్ష 11–0, 11–3, 11–3తో వాయ్ హాన్ యోంగ్ (సింగపూర్)పై గెలుపొందారు.
భారత్కే చెందిన తన్వీ ఖన్నా క్వార్టర్ ఫైనల్లో 5–11, 6–11, 12–10, 9–11తో ఎనిమిదో సీడ్ హెలెన్ టాంగ్ (హాంకాంగ్) చేతిలో ఓడిపోయింది. అంతకుముందు తొలి రౌండ్ మ్యాచ్ల్లో అనాహత్ 11–4, 11–5, 11–7తో జెమికా అరిబాడో (ఫిలిప్పీన్స్)పై, ఆకాంక్ష 11–4, 11–3, 11–8తో రిసా సుగిమోటో (జపాన్)పై విజయం సాధించారు. పురుషుల సింగిల్స్ విభాగంలో భారత ప్లేయర్ వీర్ చోత్రాని కూడా సెమీఫైనల్లోకి అడుగు పెట్టాడు.
క్వార్టర్ ఫైనల్లో వీర్ చోత్రాని 9–11, 11–6, 11–6, 11–7తో మొహమ్మద్ సిఫిక్ కమాల్ (మలేసియా)పై గెలిచాడు. ఈ టోర్నీలో విజేతగా నిలిచిన ప్లేయర్లు మే 9 నుంచి 17 వరకు చికాగోలో జరిగే ప్రపంచ చాంపియన్షిప్ పోటీలకు అర్హత సాధిస్తారు.