
PC: BCCI/IPL.com
ఐపీఎల్-2025లో కోల్కతా నైట్రైడర్స్ తమ ప్లేఆఫ్స్ ఆశలను మరింత పదిలం చేసుకుంది. ఆదివారం ఈడెన్ గార్డెన్స్ వేదికగా రాజస్తాన్ రాయల్స్తో జరిగిన కీలక మ్యాచ్లో ఒక్క పరుగు తేడాతో కేకేఆర్ సంచలన విజయం సాధించింది. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో కోల్కతా ఆరో స్దానానికి చేరుకుంది.
207 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్ రాయల్స్.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. ఆఖరి ఓవర్లో తమ విజయానికి 22 పరుగులు అవసరమవ్వగా.. రాజస్తాన్ 20 పరుగులు చేయగల్గింది. శుభమ్ దూబే ఆఖరి ఓవర్లో మెరుపులు మెరిపించినప్పటికి తన జట్టును మాత్రం గెలిపించలేకపోయాడు.
అదేవిధంగా రాజస్తాన్ కెప్టెన్ రియాన్ పరాగ్(95) అద్బుత ఇన్నింగ్స్ ఆడాడు. కేకేఆర్ బౌలర్లలో మోయిన్ అలీ, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి తలా వికెట్ సాధించారు. ఇక ఈ విజయంపై మ్యాచ్ అనంతరం కేకేఆర్ కెప్టెన్ అజింక్య రహానే స్పందించాడు. ఈ మ్యాచ్లో అద్భుతమైన ఫీల్డింగ్ ప్రదర్శన కనబరిచిన తమ ఆటగాళ్లపై రహానే ప్రశంసల వర్షం కురిపించాడు.
"ఉత్కంఠ పోరులో విజయం సాధించినందుకు చాలా సంతోషంగా ఉంది. ఒకటి లేదా రెండు పరుగుల తేడాతో గెలిచినప్పుడు ఆ విజయం మనకు చాలా సంతృప్తిని ఇస్తుంది. గుర్భాజ్, అంగ్క్రిష్ చాలా బాగా ఆడారు. వీరితో పాటు రస్సెల్ మాకు అద్బుతమైన ముగింపు అందించాడు.
పవర్ప్లేలో దూకుడుగా ఆడి, ఆ తర్వాత 12 ఓవర్ వరకు ఆచితూచి ఆడాలన్నది మా ప్రణాళిక. నేను, అంగ్క్రిష్ వీలైనంతవరకు క్రీజులో ఉండాలనుకున్నాము. ఫీల్డింగ్లో మా బాయ్స్ అద్బుతం చేశారు. మా ఫీల్డర్లు 10 నుంచి 12 పరుగులు కాపాడారు. ఇదే మా విజయంలో కీలక పాత్ర పోషించింది. రెండు మంచి క్యాచ్లు తీసుకొని, ఓ రనౌట్ చేయగలిగితే మ్యాచ్ స్వరూపమే మారిపోతుందని" పోస్ట్ మ్యాచ్ ప్రేజేంటేషన్లో రహానే పేర్కొన్నాడు.