ఆఫ్ఘనిస్తాన్ స్టార్ క్రికెటర్ రహ్మత్ షా చనిపోయాడంటూ సోషల్మీడియాలో ఓ వార్త వైరలైంది. ఈ ప్రచారంలో నిజమెంతో అని పరిశీలిస్తే.. పూర్తిగా అవాస్తవమని తేలింది. రహ్మత్ షా సురక్షితంగా, ఆరోగ్యంగా ఉన్నాడని ఆఫ్ఘన్ మీడియా వర్గాలు వెల్లడించాయి. అయితే ఈ ప్రచారానికి రహ్మత్ షా సహచర ఆఫ్ఘన్ క్రికెటర్ కరీమ్ జనత్ చేసిన ఓ సోషల్మీడియా పోస్ట్ కారణమైంది.
ఇటీవలే రహ్మత్ షా తల్లి మరణించింది. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్దిస్తూ కరీమ్ జనత్ తన మాతృ భాష పాష్టోలో ఓ సంతాప పోస్ట్ పెట్టాడు. దీన్ని ఇన్స్టాగ్రామ్ ఆటోమేటిక్ ట్రాన్స్లేషన్ తప్పుగా అనువదించడంతో రహ్మత్ షా మరణించాడని నెటిజన్లు అపార్దం చేసుకున్నారు. క్రాస్ చెక్ చేసుకోని కొందరు ఈ వార్తను విస్తృతంగా షేర్ చేయడంతో వైరలైంది.
ఇంతకీ కరీమ్ జనత్ తన పోస్ట్లో ఏం రాసుకొచ్చాడంటే.. రహ్మత్ షా తల్లి మరణ వార్త విని చాలా బాధపడ్డాను. అల్లా ఆమెకు స్వర్గం ప్రసాదించాలని కోరుకుంటున్నాను.
కాగా, 32 ఏళ్ల రహ్మత్ షా ఆఫ్ఘనిస్తాన్ టెస్ట్, వన్డే జట్లలో కీలక మిడిలార్డర్ బ్యాటర్ కమ్ పార్ట్ టైమ్ లెగ్ స్పిన్నర్గా ఉన్నాడు. 2013లో అరంగేట్రం చేసిన ఈ కుడి చేతి వాటం ఆటగాడు.. 11 టెస్ట్లు, 125 వన్డేలు ఆడాడు. టెస్ట్ల్లో 3 శతకాలు (ఓ డబుల్ సెంచరీ), 5 అర్ద శతకాల సాయంతో 970 పరుగులు చేసిన షా.. వన్డేల్లో 5 సెంచరీలు, 32 అర్ద సెంచరీల సాయంతో 4034 పరుగులు చేశాడు. బౌలింగ్లో టెస్ట్ల్లో ఒకటి, వన్డేల్లో 15 వికెట్లు తీశాడు. షా ఓ టీ20 కూడా ఆడాడు.
షా గతేడాది బంగ్లాదేశ్తో జరిగిన వన్డే సిరీస్లో చివరిసారిగా కనిపించాడు. ఆ సిరీస్లో గాయపడడంతో కొంతకాలంగా ఆటకు దూరంగా ఉన్నాడు. త్వరలో భారత్తో జరుగబోయే టెస్ట్, వన్డే సిరీస్తో షా పునరాగమనం చేయవచ్చు.


