● ఉత్తమ బోధనతోనే భారీగా అడ్మిషన్లు
● ప్రతీ యేటా ఇదే సీన్
నారాయణఖేడ్: నారాయణఖేడ్లోని జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో సీటుకోసం పోటీ నెలకొనడంతోపాటు కొన్ని రోజుల్లోనే అడ్మిషన్లు క్లోజ్ అనే బోర్డు తగిలిస్తారు. ఉన్న తక్కువ గదుల్లోనే టీచర్లు అత్యుత్తమ బోధన చేపడుతుండటంతో ఈ పాఠశాలకు క్రేజ్ నెలకొంది. తల్లిదండ్రులు ఈ పాఠశాలలో తమ పిల్లలను చేర్పించేందుకు పోటీపడతారు. తెలుగు, ఇంగ్లిష్ మీడియంలో పదోతరగతి వరకు బోధన జరుగుతుండగా 880 మంది విద్యార్థులు చదువుతున్నారు. 13 గదులు ఉండగా 22మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. 2022– 23లో 756, 2023– 24లో 800, 2024–25లో 880మంది విద్యార్థులు అడ్మిషన్ తీసుకున్నారు. గత ఏడాది 100మంది పైగా విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలల నుంచి వచ్చి చేరారు. కాగా గతేడాది జులైలోనే అడ్మిషన్లు పూర్తి చేసి సుమారు 200మంది పైగా విద్యార్థులను వెనక్కి పంపించారు. ఈ ఏడు జులై మొదటి వారంలోనే 350పైగా అడ్మిషన్లు రాగా అందులో 150పైగా అడ్మిషన్లు ప్రైవేట్ పాఠశాలల నుంచే వచ్చాయి. ఉన్న గదులు, సదుపాయాల మేరకు దాదాపు పూర్తి స్థాయిలో అడ్మిషన్లు తీసుకుంటున్నారు. చాలా గదుల్లో విద్యార్థులు పట్టక ఇరుకుగా కూర్చుంటున్నారు. పాఠశాలలో చదువుతోపాటు యోగా, క్రీడలు, బ్యూటీషియన్, సంగీతం, కంప్యూటర్ లాంటి ప్రత్యేక తరగతులను నిర్వహిస్తారు. ప్రతీ ఏడు ట్రిపుల్ఐటీ బాసరకు పలువురు విద్యార్థులు ఎంపికవుతుంటారు. పాఠశాలకు దాతల సహకారం కూడా బాగానే ఉంది. సేవోద్గం ఫౌండేషన్, డిగ్నిటీ ఫౌండేషన్ల ద్వారా హిందీ ఉపాధ్యాయులు చంద్రశేఖర్ సహకారంతో పలు స్వచ్ఛంద సంస్థలు, దాతలు, విద్యార్థులు అందరికీ బ్యాగులు, విద్యాసామగ్రి, ఇతర సదుపాయాలు ప్రతీ ఏడు కల్పిస్తున్నారు.


