వర్గల్(గజ్వేల్): భార్యతో గొడవపడిన భర్త బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన సోమవారం మండలంలోని తున్కిఖాల్సాలో చోటు చేసుకుంది. గౌరారం ఎస్ఐ కరుణాకర్రెడ్డి వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన యజ్ఞం శ్రీనాథ్(25) ప్రైవేట్ ఉద్యోగి. అతనికి భార్య పూజ, రెండేళ్ల కూతురు అవంతిక ఉన్నారు. కిరాయి ఇంట్లో ఉంటున్నారు. సంసార విషయంలో దంపతుల మధ్య కొంత కాలం నుంచి గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే నాలుగు రోజుల క్రితం భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో మనస్తాపానికి గురైన శ్రీనాథ్ క్షణికావేశంలో ఇంట్లో దులానికి ఉరేసుకున్నాడు. మృతుని తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
ప్రేమించిన యువతికి వివాహం
నిశ్చయమైందని..
చేర్యాల(సిద్దిపేట): యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన పట్టణ కేంద్రంలో సోమవారం చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... పట్టణ కేంద్రానికి చెందిన వలిమె భరత్రాజ్(26) హైదరాబాద్లో ప్రైవేటు కంపెనీలో జాబ్ చేస్తున్నాడు. ఈ క్రమంలో ఓ అమ్మాయిని అతడు ప్రేమించాడు. వీరి ప్రేమను పెద్దలు అంగీకరించకపోవడంతో విడిపోయి దూరంగా ఉంటున్నారు. గత నెల ఇంటికి వచ్చిన భరత్రాజ్ ఇంటి వద్దే ఉంటున్నాడు. ఇటీవల ఆ యువతికి మరొకరితో వివాహం నిశ్చయమైంది. ఈ విషయం తెలుసుకున్న భరత్ మనస్తాపం చెంది ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకున్నాడు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.


