
నారాయణఖేడ్: స్క్రూటిని నిర్వహిస్తున్న ఈఆర్వో, అధికారులు
జిల్లాలో మూడు నియోజకవర్గాల నుంచి 13 నామినేషన్లు తిరస్కరించారు. పటాన్చెరులో 9, నారాయణఖేడ్, జహీరాబాద్లో రెండు చొప్పున తిరస్కరణకు గురయ్యాయి.
పటాన్చెరు టౌన్: నియోజకవర్గంలో 34 మంది అభ్యర్థులు 52 సెట్లు నామినేషన్లు వేయగా సోమవారం ఎన్నికల అధికారులు స్క్రూటిని నిర్వహించారు. తొమ్మిదింటిని తిరస్కరించారు. బీఎస్సీ నుంచి నీలం మధు ముదిరాజ్ నామినేషన్ వేసి బీఫామ్ సమర్పించగా, అంతకు ముందు కాంగ్రెస్ తరఫున వేసిన సెట్ తిరస్కరించారు. అలియన్స్ డెమోక్రటిక్ రిఫార్మర్స్ పార్టీ నామినేషన్ వేసిన శ్రీశైలంయాదవ్ బీఫాం సమర్పించగా, స్వతంత్ర అభ్యర్థిగా వేసిన మరో సెట్ తిరస్కరించారు. స్వతంత్ర అభ్యర్థులు యాదగిరి, సత్యనారాయణ, బీఆర్ఎస్ అభ్యర్థి మహిపాల్రెడ్డి తరపున ఎమ్మెల్యే సతీమణి యాదమ్మ, బీజేపీ అభ్యర్థి గౌడ్ సతీమణి సంధ్య, కాంగ్రెస్ అభ్యర్థి కాటా శ్రీనివాగౌడ్ సతీమణి సుధ, యుగ తులసి పార్టీ అభ్యర్థి నిఖిల్ గౌడ్ నామినేషన్లు వేయగా తదితర కారణాలతో తిరస్కరించారు. సీపీఎం అభ్యర్థిగా మల్లికార్జున్ నామినేషన్ ఆమోదించగా, నర్సింహారెడ్డి వేసిన రెండో సెట్ను తిరస్కరించారు. మిగతా 25 మంది అభ్యర్థులు నామినేషన్లు ఆమోదం పొందాయని ఆర్ఓ దేవుజా తెలిపారు.
ఖేడ్లో రెండు ...
నారాయణఖేడ్: పట్టణంలో సోమవారం నిర్వహించిన స్క్రూటినిలో రెండు నామినేషన్లను తిరస్కరించి, 20 ఆమోదించినట్లు ఈఆర్వో వెంకటేశ్ తెలిపారు. మొత్తం 22 మంది 35 సెట్లు దాఖలు చేశారని తెలిపారు. కాంగ్రెస్ తరఫున నామినేషన్ దాఖలు చేసిన సురేశ్ షెట్కార్, బీఆర్ఎస్ తరఫున నామినేషన్ దాఖలు చేసిన మహారెడ్డి శ్రేయారెడ్డి సెట్లను తిరస్కరించామని తెలిపారు.
జహీరాబాద్లో..
జహీరాబాద్: అసెంబ్లీ స్థానానికి వచ్చిన 30 నామినేషన్లలో రెండింటిని తిరస్కరించినట్లు ఆర్ఓ వెంకారెడ్డి తెలిపారు. కాంగ్రెస్ డమ్మీ అభ్యర్థి ఆగమ ప్రమీల, బీఎస్పీ అభ్యర్థి బేగరి సిద్దన్న నామినేషన్లను తదితర కారణాలతో నామినేషన్లు తిరస్కరించినట్లు పేర్కొన్నారు.