యాచారం: విద్యుదాఘాతంతో ఆవు మృతి చెందిన సంఘటన హైదరాబాద్ గ్రీన్ ఫార్మాసిటీ పీఎస్ పరిధిలోని కుర్మిద్ద అనుబంధ గ్రామం మంగలిగడ్డ తండాలో చోటు చేసుకుంది. నేనావత్ సోనాకు చెందిన రూ.50 వేల విలువ చేసే పాలిచ్చే ఆవు బుధవారం మధ్యాహ్నం ఓ ప్రైవేట్ కంపెనీ ఏర్పాటు చేసిన గదుల వద్దకు వెళ్లింది. అక్కడ స్తంభానికున్న స్టార్టర్ డబ్బాకు తగిలి విద్యుదాఘాతంతో అక్కడికక్కడే మృతి చెందింది. ఆవు మృతికి కారణమైన ప్రైవేట్ కంపెనీ యాజమాన్యమే నష్టపరిహారం చెల్లించాలని బాధిత రైతు డిమాండ్ చేశారు.
అమీర్పేట: సనత్నగర్ ఈఎస్ఐసీ ఆసుపత్రిలో చికిత్స కోసం వచ్చిన వారి పట్ల సెక్యూరిటీ గార్డులు దురుసుగా ప్రవర్తిస్తున్నారని రోగులు ఆరోపించారు. ఓవ్యక్తి ఈ వీడియోలను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశాడు.వివరాలు.. జడ్చర్లకు చెందిన ఆకుల వెంకటేష్ చికిత్స కోసం గత శుక్రవారం 10 మందితో కలిసి ఓపీడీకి వెళుతున్నాడు. అయితే మహిళా సెక్యూరిటీ గార్డు రోగులను అడ్డుకుని దురుసుగా ప్రవర్తించి చేయి చేసుకునేందుకు ప్రయత్నించింది. దీంతో తోటి సెక్యూరిటీ గార్డులు వచ్చి మందలించారు. అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.
మేడిపల్లి: నాణ్యత లేని పన్నీరును తరలిస్తున్న ముఠాపై ఎస్ఓటీ పోలీసులు దాడులు నిర్వహించింది. నారపల్లి మోహన్ రోడ్డు నందనవనం పార్కు సమీపంలో రెండు మహీంద్రా స్కార్పియో వాహనాలలో తరలిస్తున్న నాణ్యత లేని పన్నీరును స్వాధీనం చేసుకున్నారు. జనగామ జిల్లా పెంబర్తి పోచన్నపేట గ్రామంలో కల్తీ పన్నీరు తయారు చేసి విక్రయిస్తున్న చామకూరి రాంరెడ్డి, జూల శ్రీనివాస్లను అధికారులు గుర్తించారు. వారి నుంచి 980 కేజీల పన్నీరు, స్వాధీనం చేసుకొని మేడిపల్లి పోలీసులకు అప్పగించారు.


