జిల్లా వైద్యాధికారి స్వర్ణకుమారి
అబ్దుల్లాపూర్మెట్: స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని శాంతినగర్ కుష్టు కాలనీని మంగళవారం జిల్లా వైద్యాధికారి డాక్టర్ స్వర్ణకుమారి సందర్శించారు. ఈ సందర్భంగా కుష్టు బాధితుల సంఘం సభ్యులతో సమావేశమై వారి ఆరోగ్య పరిస్థితులు, జీవన పరిస్థితులు, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, అందుతున్న సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం బాధితుల గుర్తింపు, వారి అవసరాల అంచనా, సంక్షేమ ప్రయోజనాల కల్పన కోసం నిర్వహిస్తున్న సర్వే పురోగతిని సమీక్షించారు. అనంతరం డీఎంహెచ్ఓ మాట్లాడుతూ.. కుష్టు పూర్తిగా నయం చేయగల వ్యాధి అని, ప్రారంభ దశలో గుర్తించి చికిత్స తీసుకుంటే శాశ్వత వైకల్యాన్ని నివారించవచ్చని తెలిపారు. కుష్టు బాధితులకు ప్రభుత్వం అందిస్తున్న వైద్య సేవలు, పునరావాస సదుపాయాలు, దివ్యాంగుల పెన్షన్, గుర్తింపు కార్డులు, ఉపాధి, ఇతర సంక్షేమ పథకాల గురించి అధికారులు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలని అన్నారు. సర్వేను క్షేత్రస్థాయిలో నాణ్యతతో, పారదర్శకంగా పూర్తి చేసి, అర్హులైన ప్రతి కుష్టు బాధితుడికి ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందేలా చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు సూచించారు. కార్యక్రమంలో వైద్యఆరోగ్య శాఖ అధికారులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది, కుష్టు వ్యాధి నియంత్రణ కార్యక్రమం సిబ్బంది, బాధితుల సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.


