హుడాకాంప్లెక్స్: ప్రత్యేకావసరాల విద్యార్థులకు వారి అవసరాలకు అనుగుణంగా నాణ్యమైన బోధన అందించి, వారి విద్యా పురోగతికి ప్రత్యేక శ్రద్ధ వహించాలని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు అన్నారు. ఎల్బీనగర్ జిల్లాపరిషత్ పాఠశాలలో మంగళవారం సరూర్నగర్ ఎంఈఓ బసునాయక్ ఆధ్వర్యంలో ఐఈఆర్పీలు, స్పెషల్ ఎడ్యుకేటర్లు, మండలస్థాయి ప్రాథమిక ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ.. ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు ఎఫ్ఎల్ఎన్ (ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరసీ) విధానాలను సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు. ప్రతి విద్యార్థి ప్రాథమికంగా చదవడం, రాయడం, గణిత నైపుణ్యాలను మెరుగుపర్చేలా కృషి చేయాలని అన్నారు. విద్యార్థి కేంద్రిత బోధన, సమగ్ర విద్య, నాణ్యమైన విద్యా బోధన ద్వారా ప్రభుత్వ పాఠశాలల విద్యా ప్రమాణాలను మరింత మెరుగుపర్చాలన్నారు. కార్యక్రమంలో సీఎంఓ వెంకటేశ్, స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయుడు అరుణ్ తదితరులు పాల్గొన్నారు.


