గుర్రంగూడ వేదిక
ఉత్సాహంగా వనమహోత్సవం
సాక్షి, రంగారెడ్డిజిల్లా/ఎల్బీనగర్: వనమహోత్సవం–2026 ప్రారంభ కార్యక్రమం గురువారం గుర్రంగూడ రిజర్వ్డ్ ఫారెస్ట్ వేదికగా ఉత్సాహంగా సాగింది. అటవీశాఖ మంత్రి కొండా సురేఖ, జిల్లా ఇన్చార్జి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబుతో కలిసి సీఎం రేవంత్రెడ్డి ప్రారంభించారు. ‘తెలంగాణ జనం.. వనం మధ్య పచ్చగా, ప్రశాంతంగా జీవించాలి. జీవవైవిధ్యం పరఢవిల్లాలి.. ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటాలి.. నాటిన మొక్కలను సంరక్షించాలి’ అని పలువురు వక్తలు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డి, రోడ్డు డెవలప్మెంట్ కార్పొ రేషన్ చైర్మన్ మల్రెడ్డి రాంరెడ్డి, సీనియర్ నాయకుడు దేప భాస్కర్రెడ్డి, సీనియర్ ఫారెస్ట్ అధికారి సువర్ణ, మల్కాజిగిరి మున్సిపల్ కమిషనర్ వినయ్కృష్ణారెడ్డి, వాటర్బోర్డు ఎండీ అశోక్రెడ్డి, కలెక్టర్ నారాయణరెడ్డి, ఫ్యూచర్సిటీ సీపీ తరుణ్జోషి తదితరులు పాల్గొన్నారు.
సీఎం టూర్ సాగిందిలా..
● సచివాలయం నుంచి నేరుగా రోడ్డు మార్గంలో సాయంత్రం 5.30 గంటలకు గుర్రంగూడ రిజర్వుడ్ ఫారెస్ట్కు చేరుకున్న సీఎం రేవంత్రెడ్డి, మంత్రులు కొండా సురేఖ, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఎమ్మెల్సీ పట్నం మహేందర్రెడ్డి, ఇబ్రహీంపట్నం, షాద్నగర్ ఎమ్మెల్యేలు మల్రెడ్డి రంగారెడ్డి, వీర్లపల్లి శంకర్, మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్తో కలిసి అటవీశాఖ, కాలుష్య నియంత్రణమండలి, వాటర్బోర్డులు ఏర్పాటు చేసిన ఛాయా చిత్రాలను పరిశీలించారు.
● 5.40 గంటలకు నాగలింగం మొక్క నాటి వనమహోత్సవాన్ని ప్రారంభించారు.
● 5.42 గంటలకు ‘రోబోటిక్ ఎలిఫెంట్’ను ఆవిష్కరించారు. అనంతరం రూ.17.84 కోట్ల అంచనాలతో చేపట్టనున్న పనులకు శంకుస్థాపన చేశారు.
● 5.55 గంటలకు వరంగల్లో ఎయిర్ క్వాలిటీ జోనల్ ల్యాబ్ సహా ఆర్మూర్ అరణ్య పార్కు, భద్రాద్రి కొత్తగూడెంలోని కిన్నెరసాని, సంగారెడ్డి త్రివేణివనం, ఎక్లాస్పార్క్, మెదక్ అర్బన్పార్కు, సంగారెడ్డిలో సఫారి పార్కు, సర్ధార్నగర్ అర్బన్ పార్కులను, వణ్యప్రాణి సంరక్షణ కేంద్రాలను వర్చువల్గా ఆవిష్కరించారు.
● సాయంత్రం 6 గంటలకు ‘హైదరాబాద్ గ్రీన్ మెట్రోపాలిటన్’ పుస్తకాన్ని ఆవిష్కరించారు. లఘు చిత్రాన్ని వీక్షించారు.
● పార్కు అభివృద్ధి కోసం రూ.6.70 కోట్లు విరాళంగా అందించిన రోటరీ క్లబ్ నిర్వాహకులను సన్మానించారు.
● సాయంత్రం 6.23 గంటలకు సీఎం తన ప్రసంగం ప్రారంభించి 6.52 గంటలకు ముగించారు.
సభకు హాజరైన జనం


