మీర్పేట: దుర్వాసన, పారిశుద్ధ్య లోపంతో మంత్రాల చెరువు దయనీయ స్థితికి చేరుకుందని వాకర్స్ ఆందోళన వ్యక్తం చేశారు. బడంగ్పేట సర్కిల్ మీర్పేట మంత్రాల చెరువు వద్ద గురువారం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. చెరువులో జంతువుల కళేబరాలు పడేయడంతో పాటు చెత్త పేరుకుపోవడంతో ఉదయం, సాయంత్రం వేళల్లో వాకింగ్కు రాలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి తోడు చెరువు గుర్రపుడెక్కతో నిండిపోవడం, మరోవైపు డ్రైనేజీ కలుస్తుండడంతో మురికి కూపంగా మారిందన్నారు. కొంత కాలంగా పరిసర కాలనీల వాసులు ఇబ్బందులు పడుతున్నా అధికార యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. లైట్లు వెలగకపోవడంతో సాయంత్రం 6 దాటితే పోకిరీలు అడ్డాగా చేసుకుని మత్తు పదార్థాలు, మద్యం సేవిస్తున్నారని, దీంతో మహిళలు వాకింగ్కు వెళ్లలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. అధికారులు స్పందించకపోతే కాలనీలవాసులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని వారు హెచ్చరించారు. కార్యక్రమంలో వాకర్స్ వెంకటేశ్వర్లు, రమేష్, వెంకట్రెడ్డి, సంజీవరెడ్డి, భూపాల్రెడ్డి, మహిపాల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


