యాచారం: రోడ్డు విస్తరణలో కోల్పోయే భూములకు పరిహారం చెల్లింపుపై స్పష్టత వచ్చింది. సాగర్ హైవే తక్కళ్లపల్లి గేట్ నుంచి తక్కళ్లపల్లి, నక్కర్తమేడిపల్లి గ్రామాల మీదుగా హైదరాబాద్ గ్రీన్ ఫార్మాసిటీ లేఅవుట్ వరకు రోడ్డు విస్తరణ చేపడుతున్నారు. విస్తరణలో ఆయా గ్రామాల రైతులు దాదాపు 50 ఎకరాలకు పైనే కోల్పోతున్నారు. పరిహారం చెల్లింపుపై గురువారం కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి ఆధ్వర్యంలో రెండు గ్రామాల రైతులు చర్చించారు. రోడ్డు విస్తరణ సంతోషకరమే కానీ న్యాయమైన పరిహారం అందించాలని కోరారు. అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. తక్కళ్లపల్లిలో ఎకరాకు రూ.50 లక్షల పరిహారంతో పాటు రోడ్డు విస్తరణ పక్కన ఉన్న వ్యవసాయ భూములకు నాలా కన్వర్షన్, కమర్షియల్ అవసరాలకు ఉచితంగా సేవలు అందిస్తామని చెప్పడంతో రైతులు అంగీకరించారు. ఎకరాకు రూ. 40 లక్షల పరిహారం అందజేస్తామనడంతో నక్కర్తమేడిపల్లి రైతులు మాత్రం ఒప్పుకోకుండా సమావేశం నుంచి వెళ్లిపోయారు. మరోమారు నక్కర్తమేడిపల్లి రైతులతో సమావేశం ఏర్పాటు చేస్తామని అదనపు కలెక్టర్ తెలిపారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి అనంత్రెడ్డి, తక్కళ్లపల్లి సర్పంచ్ నరేందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


